Monday, July 7, 2025
E-PAPER
Homeజాతీయంవెల్లివిరిసిన మతసామరస్యం

వెల్లివిరిసిన మతసామరస్యం

- Advertisement -

– ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం
– యాత్రికుల సందడి
నెల్లూరు :
మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోన్న, ప్రపంచ వ్యాపితంగా ప్రాముఖ్యత కలిగిన రొట్టెల పండగ నెల్లూరులో ఆదివారం ఘనంగా ప్రారంభమైరది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌, ఇతర మత భేదాలు లేవు. కులం పట్టింపులూ లేవు. అంతా ఒక్కటై నెల్లూరు స్వర్ణాల చెరువుల్లో సందడి చేశారు. దేశవిదేశాల నుంచి భారీగా తరలివచ్చిన యాత్రికులతో బారా షాహీద్‌ దర్గా కిక్కిరిసిపోయింది. చదువు, ఉద్యోగం, ఆరోగ్యం, గృహం, విదేశీయానం… ఇలా అనేక రకాల రొట్టెలను స్వర్ణాల చెరువులో వదిలారు. కర్నాటక, తమిళనాడు, తెలంగాణతోపాటు దుబారు, అఫ్ఘనిస్తాన్‌ తదితర ప్రాంతాల నుంచీ పెద్ద ఎత్తున యాత్రికులు మతాలకు అతీతంగా తరలివచ్చారు. కులం, మతం, ప్రాంతం తేడాలు లేవంటూ, తామంతా ఒక్కటేనంటూ రొట్టెల పండగను ఘనంగా జరుపుకున్నారు. ఏటా మొహర్రం సమయంలో ఈ పండగ ప్రారంభం అవుతుంది. ఐదు రోజులపాటు జరుగుతుంది. ఈ పండగను 2016లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించింది. రొట్టెల పండగకు లక్షలాది మంది రానుండడంతో జిల్లా అధికార యంత్రాంగం పక్కాగా ఏర్పాట్లు చేసింది. హిందు, ముస్లిం బాయ్‌… బాయ్‌… అనేలా ఈ పండగ సాగడం ప్రత్యేకం. ముస్లిం పండగని చెప్పినా అదే స్థాయిలో ఇతర మతాల యాత్రికులూ ఇక్కడకు రావడం ప్రత్యేకంగా చెప్పవచ్చు.

బారా షాహీద్‌ దర్గాకు సుమారు 400 ఏండ్ల చరిత్ర ఉందని రికార్డులు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో అప్పటి రాజుల మధ్య యుద్ధం జరిగిన సమయంలో యుద్ధవీరులు ఇక్కడ సమీపంలోని కొడవలూరు వద్దకు వచ్చారు. అక్కడ జరిగిన యుద్ధంలో 12 మంది యుద్ధవీరులు మృతి చెందినట్టు చరిత్ర చెబుతోంది. అక్కడి నుంచి తలలేకుండా కేవలం మొండేలతో నెల్లూరు చెరువు వద్దకు గుర్రాలపై వీరి మృతదేహాలు చేరుకున్నాయని చెపుతారు. అక్కడే వారిని సమాధి చేసి ఈ ప్రాంతానికి బారా (12) షాహీద్‌ దర్గాగా నామకరణం చేశారు. నెల్లూరు చెరువు పేరును స్వర్ణాల చెరువుగా మార్చారు. ఇక్కడ రొట్టెల పండగ ఏటా నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్వర్ణాల చెరువులో స్నానం చేసి కోర్కెలు కోరుకొని రొట్టెలు వదిలితే అవి నెరవేరుతాయని విశ్వసిస్తారు.

ఇలా ఇది ప్రాచుర్యం పొందడంతో ఏటా యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఏటా 20 నుంచి 30 లక్షల మంది యాత్రికులు వస్తారని అంచనా. 6వ తేదీ సంధల్‌ మాల్‌, 7న గంథమహోత్సవం, 8న రొట్టెల పండగ, 9న తహలీల్‌ ఫాతేహ, 10న ముగింపు వేడుకలతో రొట్టెల పండగ ముగియనుంది. రొట్టెల పండగకు తరలివచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఎస్పీ కృష్ణతేజ, జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నందన్‌ ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -