నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు సర్వేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. పెళ్లయిన నెల రోజులకే ఈ ఘోరం జరగడం, దీని వెనుక భార్య, ఆమె తల్లి, ప్రియుడి హస్తం ఉన్నట్లు తెలియరావడం తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ (32) ప్రయివేటు సర్వేయర్గా పనిచేస్తున్నాడు. అతనికి ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో వివాహం నిశ్చయమైంది. అయితే, పెళ్లికి కేవలం ఐదు రోజుల ముందు ఐశ్వర్య అదృశ్యమవడం కలకలం రేపింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో పనిచేసే ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, అతనితోనే వెళ్లిపోయి ఉంటుందని అందరూ భావించారు.
కానీ, ఫిబ్రవరి 16న ఐశ్వర్య తిరిగి ఇంటికి వచ్చి, తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తనకు ఎవరితోనూ ప్రేమ వ్యవహారం లేదని, కట్నం కోసం తల్లి పడుతున్న ఇబ్బందులు చూడలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లానని చెప్పింది. “నువ్వంటే నాకు చాలా ఇష్టం” అంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో తేజేశ్వర్ ఆమె మాటలు నమ్మాడు. తల్లిదండ్రులు వద్దంటున్నా వారిని ఒప్పించి, మే 18న ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు.
పెళ్లయిన రెండో రోజు నుంచే తేజేశ్వర్, ఐశ్వర్య మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు. ఆందోళన చెందిన అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఆంధ్రప్రదేశ్లోని పాణ్యం సమీపంలో సుగాలిమెట్టు వద్ద తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది.
తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను, ఆమె తల్లి సుజాతను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తోంది. అదే బ్యాంకుకు చెందిన ఉద్యోగితో సుజాతకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఆ ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతో కూడా సంబంధం ఏర్పరచుకున్నట్లు సమాచారం. తేజేశ్వర్తో వివాహం జరిగిన తర్వాత కూడా ఐశ్వర్య ఆ బ్యాంకు ఉద్యోగితో ఏకంగా 2,000 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ను తొలగిస్తే, అతని ఆస్తి కూడా దక్కుతుందని భావించి హత్యకు పథకం పన్నినట్లు తెలుస్తోంది.
తేజేశ్వర్ను హత్య చేసేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాకుండా, తన డ్రైవర్ను కూడా వారి వెంట పంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పథకం ప్రకారం, జూన్ 17న కొందరు వ్యక్తులు తేజేశ్వర్ను కలిశారు. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దానిని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో అతడిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. మార్గమధ్యంలో కారులోనే తేజేశ్వర్పై కత్తులతో దాడి చేసి, గొంతుకోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పడేసి వెళ్లిపోయారు.
ఈ దారుణ ఘటనలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను ఇప్పటికే అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.