– అమెరికా దాడులపై భారత వైఖరిని స్పష్టంగా వెల్లడించాలి : కేంద్రానికి సీపీఐ(ఎం) డిమాండ్
– గ్వాలియర్లో భారీ నిరసన ప్రదర్శన
గ్వాలియర్: ఇరాన్పై అమెరికా జరిపిన దాడులను సీపీఐ (ఎం) తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేసి ఆటవికంగా, నేరపూరితంగా దాడులు జరిపిం దని మండిపడింది. అమెరికా దాడులను నిరసిస్తూ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో ఆదివారం జరిగిన భారీ ప్రదర్శనకు సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అమెరికా దాడులపై మోడీ ప్రభుత్వ వైఖరి నిరుత్సాహకరంగా ఉన్నదని చెప్పారు. ఇప్పటి వరకూ భారత్ అవలంబిస్తున్న సంప్రదాయ విదేశాంగ విధానానికి ఇది విరుద్ధమని తెలిపారు. ప్రభుత్వం వెంటనే అమెరికా దాడులను స్పష్టమైన పదజాలంతో ఖండించాలని డిమాండ్ చేశారు. భారత్తో ఇరాన్ ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోందని, ప్రతి కష్ట సమయంలోనూ భారత్కు మద్దతు ఇస్తోందని గుర్తు చేశారు. ఇరాన్ సార్వభౌమత్వంపై దాడి జరిగిన ప్రస్తుత సమయంలో ఆ దేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదని ఎంఏ బేబీ అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ నుండి వచ్చిన ఒత్తిడి కారణంగా మోడీ ప్రభుత్వం ఇప్పుడు అమెరికా వైపు నిలుస్తోందని, తద్వారా అంతర్జాతీయంగా భారతదేశానికి ఉన్న విశ్వసనీయతను, కీర్తిని దెబ్బతీస్తోందని విమర్శించారు. ఇరాన్పై దాడి చేయడానికి అమెరికా కుంటిసాకులు చెబుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ అణు బాంబు తయారు చేయలేదని, అసలు దానిని తయారు చేసే సామర్ధ్యం ఇరాన్కు లేదని అమెరి కా ఇంటెలిజెన్స్ అధిపతి తులసీ గబ్బార్డ్ తొలుత మార్చిలో, ఆ తర్వాత మేలో ఆ దేశ పార్లమెంటేరియన్లకు చెప్పారని, ఈ నెల 17న కూడా అదే మాట చెప్పారని గుర్తు చేశారు. మరి అలాంటప్పుడు తాజా దాడులను ఎలా సమర్ధించుకుంటారని ఆయన ప్రశ్నించారు.
ఇరాన్ అణు బాంబును తయారు చేయడం లేదని, తన అణు శక్తి ఉత్పత్తి కేంద్రాలలో విచారణకు సహకరిస్తోందని రెండు రోజుల క్రితమే అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాస్సీ చెప్పిన విషయాన్ని కూడా బేబీ ప్రస్తావించారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై సైతం ఇరాన్ సంతకం చేసిందని గుర్తు చేశారు. దాని నుండి వైదొలుగుతున్నానని ఇరాన్ ఎన్నడూ చెప్పలేదని అన్నారు. అణు బాంబును తయారు చేయబోనని ఐరాసలో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్తో కలిసి జేసీసీఓఏ ఒప్పందంపై సంతకం చేసి హామీ కూడా ఇచ్చిందని తెలిపారు. ఇరాన్ ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నదని చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో ఇరాన్పై దాడి చేయడం మధ్య ఆసియాపై పెత్తనం చెలాయించేందుకేనని, ప్రపంచాన్ని భయపెట్టేందుకేనని ధ్వజమెత్తారు.
అమెరికావన్నీ అబద్ధాలే….
ఇరాన్ పైన కూడా అమెరికా, సామ్రాజ్యవాద శిబిరం ఇలాంటి అబద్ధాలే వల్లె వేసిందని బేబీ అన్నారు. అక్కడి పురాతన నాగరికతను ధ్వంసం చేసిన తర్వాత తమకు తప్పుడు సమాచారం అందిందని అంగీకరించాయని చెప్పారు. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా గాజాలో కొనసాగుతున్న మారణహోమాన్ని కూడా బేబీ ఖండించారు. అందులో మహిళలు, చిన్నారులు సహా అరవై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పాలస్తీనా పక్షాన నిలవాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దాడులకు వ్యతిరేకంగా గళం విప్పాలని ఆయన దేశ ప్రజలను కోరారు.
ప్రదర్శనను ఉద్దేశించి సీపీఐ (ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్.అరుణ్ కుమార్ ప్రసంగించారు. భారత విదేశాంగ విధానం ఎప్పుడూ యుద్ధాన్ని వ్యతిరేకిస్తుందని ఆయన గుర్తు చేశారు. ఇది యుద్ధానికి సమయం కాదని ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారని అన్నారు. ఇప్పుడు ఆయన తన మాటకు కట్టుబడి ఉండాలని, ఇరాన్పై జరుగుతున్న దాడికి, పాలస్తీనాలో జరుగుతున్న మారణహోమానికి వ్యతిరేకంగా మాట్లాడాలని కోరారు. సీపీఐ (ఎం) మధ్యప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు జస్వీందర్ సింగ్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ సీనియర్ నేత గురు దత్ శర్మ కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.