– న్యాయమూర్తుల్లో మహిళలు నాలుగు శాతమే
– ఆవిర్భావం నుంచి పనిచేసింది 11 మందే
– ప్రస్తుతం మిగిలింది ఒక్కరే
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మహిళల ప్రాతినిధ్యం చాలా స్వల్పంగా ఉంటోంది. ఇప్పటి వరకూ అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన న్యాయమూర్తుల్లో కేవలం నాలుగు శాతం మంది మాత్రమే మహిళలు ఉండడం విచారకరం. పురుష న్యాయమూర్తులతో పోలిస్తే వారి పదవీ కాలం కూడా తక్కువే. ఈ నెల 24న జస్టిస్ అభరు ఎస్.ఓకా పదవీ విరమణ చేయడంతో ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31కి తగ్గిపోయింది. సుప్రీంకోర్టుకు 34 మంది న్యాయమూర్తులను ప్రభుత్వం మంజూరు చేయగా ప్రస్తుతం మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఫుల్ బెంచ్లో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. వీరిలో బేలా ఎం.త్రివేది ఈ ఏడాది జూన్ 9న పదవీ విరమణ చేస్తారు. వేసవి సెలవల నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన ఆమె చివరిసారిగా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో జస్టిస్ బీవీ నాగరత్న మాత్రమే ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ఏకైక మహిళా న్యాయమూర్తి.
నలుగురికి మించి దక్కని ప్రాతినిధ్యం
అయితే సుప్రీంకోర్టులో ఎప్పుడూ నలుగురికి మించి మహిళా న్యాయమూర్తులు విధుల్లో లేరు. వాస్తవానికి 2011 సెప్టెంబర్ 13న ఒకే సమయంలో ఒకరి కంటే ఎక్కువ మంది మహిళా న్యాయమూర్తులు పనిచేశారు. అప్పుడు జస్టిస్ రంజనా పి.దేశారుని పదోన్నతిపై సుప్రీంకోర్టుకు పంపగా అప్పటికే జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా అక్కడ పనిచేస్తున్నారు. 2014 ఏప్రిల్ 27 వరకూ వీరు పదవిలో కొనసాగారు. ఆ రోజు జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా పదవీ విరమణ చేశారు. 2018 ఆగస్ట్ 7వ తేదీన సుప్రీంకోర్టులో తొలిసారిగా ముగ్గురు మహిళా న్యాయమూర్తులు విధులు నిర్వర్తించారు. వారు సుమారు రెండు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. 2020 జూలై 19న జస్టిస్ బానుమతి పదవీ విరమణ చేయడంతో తిరిగి ఇద్దరు మహిళా న్యాయమూర్తులు మాత్రమే మిగిలారు. సుప్రీంకోర్టులో 2011 సెప్టెంబర్ 13 నుండి 2014 ఏప్రిల్ 27 వరకూ ఇద్దరు, 2018 ఆగస్ట్ 7 నుండి 2020 జూలై 19 వరకూ ముగ్గురు, 2021 ఆగస్ట్ 31 నుండి 2022 సెప్టెంబర్ 23 వరకూ నలుగురు మహిళా న్యాయమూర్తులు పనిచేశారు.
2021 ఆగస్ట్ 31న తొలిసారిగా సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తులు…ఇందిరా బెనర్జీ, హిమా కోహ్లీ, బీవీ నాగరత్న, బేలా ఎం.త్రివేది…పనిచేయడం గమనార్హం. అయితే అత్యున్నత న్యాయస్థానంలో ఐదుగురు మహిళా న్యాయమూర్తులు ఒకేసారి పనిచేసిన దాఖలాలు ఇప్పటి వరకూ లేవు. పైగా మహిళా న్యాయమూర్తులలో ఇప్పటి వరకూ ఎవరూ ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేరుకోలేదు.
వీరే మహిళా న్యాయమూర్తులు
ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కూర్పు ప్రకారం 85 శాతం మంది పురుషులు, ఆరు శాతం మంది మహిళలు ఉండగా తొమ్మిది శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టు 1950 జనవరి 28న ఉనికిలోకి వచ్చింది. అప్పటి నుండి అందులో 279 మంది న్యాయమూర్తులు పనిచేశారు. వీరిలో కేవలం 11 మంది మాత్రమే మహిళలు. అంటే నాలుగు శాతం అన్న మాట. మిగిలిన 96 శాతం మంది పురుష న్యాయమూర్తులే. జస్టిస్ ఫాతిమా బీవి, జస్టిస్ సుజాత మనోహర్, జస్టిస్ రుమాపాల్, జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా దేశారు, జస్టిస్ ఆర్.బానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్ర, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ బీవీ నాగరత్న సుప్రీంకోర్టులో ఇప్పటి వరకూ పనిచేసిన, చేస్తున్న మహిళా న్యాయమూర్తులు.