నవతెలంగాణ-హైదరాబాద్: మహిళల వన్డే ప్రపంచకప్ లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే మూడు టీమ్లు సెమీస్కు చేరుకోగా.. నాలుగో బెర్తు ఖరారు కావల్సి ఉంది. తమకు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఎలిమినేట్ అయిపోయాయి. ఈ ప్రపంచ కప్లో పాకిస్తాన్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. భారత్, న్యూజిలాండ్, శ్రీలంక టాప్-4 లోకి వచ్చేందుకు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు సంబంధించి అప్డేట్ ఒకటి వచ్చింది. ఫైనల్ మ్యాచ్ కూడా భారత్ వేదికగానే జరగనుంది. దీనికి నవీ ముంబయి ఆతిథ్యం ఇవ్వనుంది.
ఫైనల్ భారత్లోనే …
పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఐసీసీకి వెసులుబాటు దక్కింది. ఒకవేళ పాక్ ఫైనల్కు చేరుకుంటే.. ఆ మ్యాచ్ను కొలంబోలో నిర్వహించాల్సి ఉండేది. ఇప్పుడు లీగ్ స్టేజ్లోనే ఔట్ కావడంతో ఫైనల్ భారత్లోనే జరగనుంది. తొలి సెమీస్ (అక్టోబర్ 29)కు ఇంకా వేదికను ఖరారు చేయలేదు. ఆ మ్యాచ్కు ఇందౌర్ ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. రెండో సెమీస్ (అక్టోబర్ 30) నవీ ముంబయిలోనే జరగనుంది. నవంబర్ 2న మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఉంది.
గురువారం మ్యాచ్ అత్యంత కీలకం …
తొలి రెండు మ్యాచుల్లో గెలిచి అదరగొట్టిన భారత్కు ఆ తర్వాత కలిసి రాలేదు. వరుసగా మూడింట్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గురువారం న్యూజిలాండ్తో మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం. ఇందులో ఏమాత్రం ఓడినా సెమీస్కు చేరుకోవడం మరింత కష్టంగా మారడం ఖాయం. ఎందుకంటే నాలుగో బెర్తు కోసం రేసులో కివీస్, శ్రీలంక మాత్రమే ఉన్నాయి.