నవతెలంగాణ – హైదరాబాద్: భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్కు దురదృష్టకర రీతిలో తెరపడింది. వెస్టిండీస్తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో డబుల్ సెంచరీకి చేరువైన జైస్వాల్, అనూహ్యంగా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. సహచర ఆటగాడు శుభ్మన్ గిల్తో సమన్వయ లోపం కారణంగా విలువైన వికెట్ను చేజార్చుకున్నాడు. రెండో రోజు ఆట తొలి సెషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మిడాఫ్ దిశగా బంతిని ఆడిన జైస్వాల్, పరుగు కోసం ముందుకు వెళ్లాడు. అయితే, నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న గిల్ స్పందించలేదు. అప్పటికే పిచ్ మధ్యలోకి చేరుకున్న జైస్వాల్, తిరిగి క్రీజులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.
కానీ, ఫీల్డర్ చందర్పాల్ వేగంగా బంతిని అందుకొని వికెట్ల వైపు విసరడంతో జైస్వాల్ తన వికెట్ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ రనౌట్తో 175 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జైస్వాల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో డబుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. జైస్వాల్ అవుట్ అయిన తరువాత క్రీజ్ లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి దూకుడుగా అడుతూ.. 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జొమెల్ వారికన్ బౌలింగ్ లో జైడెన్ సీల్స్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరోవైపు కెప్టెన్ గిల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 105 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. క్రీజులో గిల్ (72), జురెల్ (1)ఉన్నారు.