నవతెలంగాణ-హైదరాబాద్: సింగూరు డ్యామ్ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉన్నదని, దీనిపై తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) హెచ్చరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మొన్న జూరాల ప్రాజెక్టుకు ప్రమాదఘంటికలు.. నిన్న మంజీరా బ్యారేజీకి పొంచి ఉన్న ముప్పు.. నేడు సింగూరు డ్యామ్కు డేంజర్ బెల్స్ మోగాయని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇతర ప్రాజెక్టులకు రిపేర్లు వస్తే తప్పులేదనట్టు ఫోజులు కొట్టే కాంగ్రెస్, బీజేపీ నేతలు.. కాళేశ్వరంపై మాత్రం బురదజల్లడం.. వాళ్ల దిగజారుడుతనానికి నిదర్శనం అని మండిపడ్డారు. ప్రాజెక్టులు కట్టాక రిపేర్లు వస్తుంటాయనే విషయాన్ని మభ్యపెట్టి కేవలం మేడిగడ్డ బ్యారేజీలోని రెండు పిల్లర్లను బూచిగా చూపించి కమిషన్ల పేరిట కక్షగట్టడం అత్యంత దుర్మార్గం అని ధ్వజమెత్తారు. జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడంతోపాటు బలహీనంగా ఉన్న ఇతర గేట్ల రోప్ లను అలాగే గాలికొదిలేస్తే ప్రాజెక్టు నిలుస్తుందా ? హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం చేసిన హెచ్చరికపై సోయిలేకపోతే మంజీరాకు మనుగడ ఉంటుందా ? ఇవాళ సింగూరు డ్యామ్కు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అదే NDSA హెచ్చరికను కూడా అలాగే పెడచెవిన పెట్టి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా ? అని కేటీఆర్ ప్రశ్నించారు.
జూరాలకు, మంజీరాకు, సింగూరుకు ఒక న్యాయం.. మేడిగడ్డ బ్యారేజీకి మాత్రం మరో న్యాయం అంటే నాలుగు కోట్ల ప్రజలు ఊరుకోరు. అన్ని ప్రాజెక్టులకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేయాల్సిందే. ప్రజలు సాగు, తాగునీటి గోస తీర్చే ఏ ప్రాజెక్టునైనా కంటికి రెప్పలా కాపాడాల్సిందే..!! అని కేటీఆర్ పేర్కొన్నారు.