నవతెలంగాణ-హైదరాబాద్: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా డే పోస్టల్ స్టాంప్ ను మోడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. మోడీ మాట్లాడుతూ.. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలను యోగా ఏకం చేసిందని, యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయని పేర్కొన్నారు. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదని, యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని వివరించారు. వన్ఎర్త్.. ఎన్ హెల్త్ థీమ్తో ఈసారి యోగా దినోత్సవాన్ని నిర్వహించామని తెలిపారు. యోగాకు వయసుతో పనిలేదని.. యోగాకు హద్దులు లేవని మోడీ అన్నారు.

ఏపీ సిఎం చంద్రబాబు మాట్లాడుతూ… యోగా దినోత్సవం రోజు విశాఖలో రికార్డు సృష్టించబోతున్నామని తెలిపారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 1.44 లక్షల మంది యోగా శిక్షకులు నమోదు చేసుకోగా, శుక్రవారం 22 వేల మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించారని వెల్లడించారు. యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయని, దీనిని అన్ని క్రీడల్లో భాగం చేయాలని పేర్కొన్నారు. 130 దేశాల్లో యోగా దినోత్సవాన్నినిర్వహించుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు.