నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ తో పాక్ పై భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్, పీంకే కేంద్రంగా తిష్టవేసిన ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భీకర దాడులు చేసింది. కానీ ఇండియన్ ఎటాక్తో అల్లాడిపోయిన పాక్ ఆర్మీ.. భారత్ సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా జమ్మూలోని ఎల్ఓసీకు దగ్గరగా ఉన్న పలు గ్రామాల మీద బాంబులతో దాడి చేసింది. సామాన్య పౌరుల నివసాలే లక్ష్యంగా దాడులకు తెగబడింది. ఆ పాక్ దుస్సాహసాన్ని భారత్ బలగాలు తిప్పికొట్టాయి. ఈక్రమంలో పలు ఇండ్లు పాక్ దాడుల్లో ధ్వంసమైయ్యాయి. అయితే పలు రోజులనుంచి జమ్ముకశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న ఇండ్లను పునర్ నిర్మిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. తాజాగా శుక్రవారం ఉపముఖ్యమంత్రి సిరిందర్ చౌదరి పర్యటించారు. పాక్ దాడులతో అతిగా దెబ్బతిన్న రాజౌరి జిల్లాలోని నౌషరా గ్రామానికి వెళ్లారు. పాక్ కాల్పుల్లో దెబ్బతిన్న పలు ఇండ్లను ఆయన పరిశీలించారు. బాధితులను స్వయంగా కలిసి మాట్లాడారు. సీఎం ఆదేశానుసారం త్వరలో బాధితులకు ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. యుద్ధ సమయంలో సరిహద్దు ప్రాంతాలను వదిలివెళ్లిపోకుండా భారత్ ఆర్మీకి అండగా నిలబడ్డారని , పాక్ దాడులకు బెదరకుండా దైర్యంగా స్వస్థలంలో ఉన్న నిజమైన దేశభక్తులు మీరేనని ప్రశంసించారు.
