నవతెలంగాణ న్యూఢిల్లీ: ఒక్క మిస్డ్ కాల్ చేసి లేదా ఎస్ఎంఎస్ పంపించి, ఈపీఎఫ్ఓ బ్యాలన్స్ను చెక్ చేసుకోవచ్చు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సేవలు మరింత సులభతరం అయ్యాయి. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతా వివరాలను తనిఖీ చేసుకోవాలని కోరుకున్న ప్రతిసారీ ఈపీఎఫ్ఓ ఆఫీసుకు వెళ్లడమో లేకపోతే ఆన్లైన్ వెబ్సైట్లో చూసుకోవాలి. ఇది అంత సులభం కాదు.
ఈ సేవలు ఉచితం, వినియోగించుకోవడం సులభం, స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోయినప్పటికీ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలను వినియోగించుకోవాలంటే, ముందుగా, ఖాతాదారు పీఎఫ్ ఖాతా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) క్రియాశీలం (యాక్టివ్)గా ఉండాలి. బ్యాంకు ఖాతాకు లేదా ఆధార్ నంబరుకు లేదా పాన్ నంబరుకు యూఏఎన్ అనుసంధానం అయి ఉండాలి. ఈపీఎఫ్ఓ పోర్టల్లో యూఏఎన్ నంబరుతో ఖాతాదారు మొబైల్ నంబరు కూడా తప్పనిసరిగా నమోదై ఉండాలి.
మిస్డ్ కాల్ సేవలు
మిస్డ్ కాల్ సేవను పొందాలంటే, 9966044425 ఫోన్ నంబరుకు రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి మిస్డ్ కాల్ ఇవ్వాలి. రెండుసార్లు రింగ్ అయిన తర్వాత తనంతట తానే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. తర్వాత టెక్స్ మెసేజ్ వస్తుంది. తాజా ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్, ప్రస్తుత పీఎఫ్ బ్యాలన్స్ వివరాలు ఈ మెసేజ్లో ఉంటాయి. ఈ సేవలు రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయి.
ఎస్ఎంఎస్ సేవలు
రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి EPFOHO UAN అని టైప్ చేసి 7738299899 ఫోన్ నంబరుకు ఎస్ఎంఎస్ పంపించాలి. తాజా పీఎఫ్ కంట్రిబ్యూషన్, ప్రస్తుత పీఎఫ్ బ్యాలన్స్ వివరాలతో సమాధానం వస్తుంది.
ప్రాంతీయ భాషలో…
ఎస్ఎంఎస్ సేవలను ప్రాంతీయ భాషల్లో కూడా పొందవచ్చు. ఎస్ఎంఎస్ మెసేజ్లో యూఏఎన్ తర్వాత ప్రాంతీయ భాష యొక్క ఆంగ్ల స్పెల్లింగ్లోని మొదటి మూడు అక్షరాలను రాసి, పంపించాలి. ఉదాహరణకు తెలుగులో సమాచారం కావాలనుకుంటే, EPFOHO UAN TEL అని టైప్ చేసి, 7738299899 నంబరుకు పంపించాలి.