Tuesday, July 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఉద్యోగాలివ్వాల్సిందే

ఉద్యోగాలివ్వాల్సిందే

- Advertisement -

– జీవో 81, 85ను వెంటనే అమలు చేయాలి
– ఎన్నికల హామీని కాంగ్రెస్‌ నిలబెట్టుకోవాలి
– లేకుంటే ‘స్థానిక’ ఎన్నికల్లో తగిన మూల్యం తప్పదు : సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
– సీసీఎల్‌ఏను ముట్టడించిన వీఆర్‌ఏలు ఆర్‌.కృష్ణయ్య సంఘీభావం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తాతల, తండ్రుల కాలం నుంచి గ్రామాల్లో సేవలందిస్తున్న తమను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకుని భద్రత కల్పించాలని వీఆర్‌ఏ వారసులు డిమాండ్‌ చేశారు. వీఆర్‌ఏ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ)ను ముట్టడించారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది వీఆర్‌ఏలు తరలి వచ్చారు. పోలీసులు వారిని సీసీఎల్‌ఏ కార్యాలయంలోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీఆర్‌ఏలు రోడ్డుపైనే బైటాయించి నిరసనకు దిగారు. కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో సీసీఎల్‌ఏ కార్యాలయం ఆవరణలోని క్యాంటిన్‌ వరకు నిరసనకారులను పోలీసులు అనుమతించారు. అక్కడే ఉదయం 11.30 గంటల నుంచి 1.30 వరకు రెండు గంటల పాటు ఆందోళన చేశారు. జీవో 81, 85ను అమలు చేయాలి… వీ వాంట్‌ జస్టిస్‌, మాకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు, జెండాలు, బ్యానర్లు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీఆర్‌ఏల జేఏసీ కన్వీనర్‌ వంగూరి రాములును ఉదయం నుంచి బయటకు రాకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అతని ఫోన్‌ లాక్కుని స్విచ్ఛాఫ్‌ చేశారు. తమ నాయకుణ్ని ధర్నా స్థలికి తీసుకొస్తేనే ఇక్కడి నుంచి కదులుతామని నిరసనకారులు తేల్చి చెప్పారు. దాంతో గంట తర్వాత ఆయన్ని సీసీఎల్‌ఏ వద్దకు పోలీసులు తీసుకురావడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ధర్నానుద్దేశించి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు వీఆర్‌ఏ వారసులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేస్తూ గత సర్కార్‌ 20,555 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి జీవో 81, 85 తెచ్చిందని గుర్తు చేశారు. అయితే 16,758 మందిని మాత్రమే వివిధ విభాగాల్లో సర్దుబాటు చేసిందని చెప్పారు. మిగిలిన 3,798 మంది వీఆర్‌ఏలను పట్టించుకోలేదని అన్నారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ సర్కార్‌ రెండేండ్లు గడుస్తున్నా సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని జూలకంటి హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ తరతరాలుగా రెవెన్యూ వ్యవస్థకు మూల స్తంభాలుగా ఉన్న వీఆర్‌ఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గత సర్కార్‌ తెచ్చిన పథకాలను అదే పేరుతో అమలు చేయడం ఇష్టం లేక పేర్లు మారుస్తున్న విధంగానే… పూర్వ్ట వీఆర్‌ఏల భర్తీ కోసం తెచ్చిన జీవోలను మార్చయినా సరే… వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. గ్రామాల్లో ఏ కార్యక్రమం జరిగినా వీఆర్‌వోలే అన్ని చక్కబెడుతారని గుర్తు చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్నయ్య మాట్లాడుతూ వీఆర్‌ఏల వారసులు నాలుగేండ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూసి ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్‌ఏలంటేనే గ్రామాల ముఖ చిత్రాలనీ, వారి న్యాయమైన డిమాండ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిష్కరించాలని కోరారు. వీఆర్‌ఏ జేఏసీ కన్వీనర్‌ వంగూరి రాములు మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎదురుచూసి, మానసిక ఒత్తిడి తట్టుకోలేక వీఆర్‌ఏలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 340 మందికి పైగా మరణించారని అన్నారు. ఇప్పటికైనా సర్కార్‌ స్పందించి ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు సహాయ కమిషనర్‌ దుర్గకు అందించారు. ఈ ధర్నాలో వీఆర్‌ఏ జేఏసీ నాయకులు నగేశ్‌కుమార్‌, రమేశ్‌, మధు, శివ, హరీష్‌, గంగమల్లు, రాజళింగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -