– హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 1.28లక్షల దరఖాస్తులు
– ఈ ఏడాదికి జిల్లాకు 41వేలకు పైగా యూనిట్ల కేటాయింపు
– 2 లక్షల నుంచి 4లక్షల యూనిట్లకే పోటీ ఎక్కువ
– ఈనెల చివరిలోగా లబ్దిదారుల ఎంపిక
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన తుది దశకు చేరుకుంది. హైదరాబాద్ జిల్లాలో రెండ్రోజుల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు చకచకా సాగుతున్నాయి. ఈ పథకానికి సిబిల్ స్కోర్ తప్పనిసరి అని ప్రచారం జరిగిన నేపథ్యంలో వాటిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొట్టిపారేయడంతో దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరికి వర్తిస్తుందోనని ఎదురు చూస్తున్నారు.
రెండ్రోజుల్లో లబ్దిదారుల జాబితా
నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి రాయితీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి 16,23,764 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.4లక్షల కేటగిరీలో రుణాల కోసం 12 లక్షలకుపైగా దరఖాస్తులొచ్చాయి. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ పథకానికి 1,28,763 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో మైనార్టీ, బీసీ, ఎస్సీ యువత అత్యధికంగా దరఖాస్తు చేసుకోగా.. ఎస్టీ యువత అత్యల్పంగా దరఖాస్తు చేసుకున్నారు. కనిష్టంగా రూ.50వేల యూనిట్లకు, గరిష్టంగా రూ.4 లక్షల యూనిట్లకు దరఖాస్తులు అందాయని అధికారులు చెబుతున్నారు. లబ్దిదారులను తేల్చేందుకు మండలాల వారీగా దరఖాస్తులను పరిశీలించారు. ప్రస్తుతం మండల కమిటీల ఆధ్వర్యంలో లబ్దిదారుల జాబితా రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒక కుటుంబంలో ఒక్కరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. గడిచిన ఐదేండ్లలో ప్రభుత్వ పరంగా ఏ కార్పొరేషన్ నుంచి లబ్ది పొందారా లేదా అని గుర్తించనున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని చెల్లించకుండా డిఫాల్టర్లుగా మారినవారు ఎవరైనా జాబితాలో ఉన్నారా లేదా అని తేల్చే బాధ్యతలను బ్యాంకర్లకు అప్పగించారు. బ్యాంకర్ల నుంచి స్పష్టత వస్తే మండలాల వారీగా జాబితాలను రూపొందించి జిల్లా కమిటీకి ప్రతిపాదిస్తారు. కలెక్టర్ చైర్మెన్గా ఉన్న జిల్లా కమిటీ.. లబ్దిదారుల తుది జాబితాను రూపొందించనుంది. ఈనెల ఆఖరుకు ఈ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. అనంతరం తుది జాబితాను జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదానికి పంపిస్తారు. మంత్రి ఆమోదం అనంతరం జూన్ 2న లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు.
41వేల యూనిట్లు.. 580 కోట్ల సబ్సిడీ
జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి భారీగా దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ ఏడాదికి యూనిట్లు మాత్రం సగం లోపే ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాదికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, క్రిస్టియన్ మైనార్టీలకు కలిపి 41,726 యూనిట్లుండగా.. ఇందులో జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్కు 21,090 మంది దరఖాస్తులు చేయగా.. 6638 యూనిట్లు కేటాయించారు. ఎస్టీ కార్పొరేషన్కు 2602 అప్లికేషన్కు..1412 యూనిట్లు, బీసీ, ఈబీసీ కలిపి 38,954 దరఖాస్తులకు..15,442 యూనిట్లు, మైనార్టీ కార్పొరేషన్కు 64,982 దరఖాస్తులకు 17,253 యూనిట్లు, క్రిస్టియన్ కార్పొరేషన్కు 1,135 అప్లికేషన్స్ రాగా.. 981 యూనిట్లను కేటాయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 580 కోట్లు సబ్సిడి విడుదల చేయనుంది. రూ. 50 వేల నుంచి 4 లక్షల వరకు ప్రభుత్వం అందించే సహాయం కోసం దాదాపు 1.28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. లబ్దిదారుల ఎంపికలో ఒంటరి మహిళలు, వితంతువుల కోసం 25 శాతం, వికలాంగుల కోసం 5 శాతం కేటాయించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీ కేటగిరీలోని ఉప కులాలకు కూడా లబ్దిదారుల ఎంపికలో ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి రెండు మూడు నెలల్లో అన్ని యూనిట్లలోని లబ్దిదారులకు విడతల వారీగా అందజేయనున్నారు.
తుది దశకు యువ ‘వికాసం’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES