చండీగఢ్: పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ విషయాన్ని హర్యానా పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఆమె ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలపై కూడా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. హర్యానాలోని హిస్సార్కు చెందిన 33 ఏండ్ల యూట్యూబర్ జ్యోతిని ఈ నెల 16ను అరెస్టు చేశారు. ఆమెపై అధికారిక రహస్యాల చట్టం, బీఎన్ఎస్లోని మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, గత వారాల్లో గూఢచర్యం ఆరోపణలపై పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి 12 మందిని అరెస్టు చేశారు. వీరిలో జ్యోతి ఒకరు. ఆమె విదేశీపర్యటనపై లోతుగా విచారణ చేస్తున్నామని మంగళవారం హర్యానా సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అలాగే, జ్యోతి ల్యాప్టాప్పై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోందని, ఆమెతో సంబంధం ఉన్న వారిని కూడా ప్రశ్నిస్తామని చెప్పారు.