నవతెలంగాణ – హైదరాబాద్: సినీ నటి కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సిద్ధమౌని నరేందర్ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్న అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే క్రమంలో ఈ దాడి జరిగింది. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. వివరాల్లోకి వెళితే.. టీటీడీ పేరుతో నరేందర్ లక్కీ డ్రా నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడని కరాటే కళ్యాణి గతంలోనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.399కే ఫార్చ్యూనర్ కారు, ఐఫోన్ వంటి బహుమతులు ఇస్తామని నమ్మిస్తూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఆదిభట్ల సమీపంలోని వండర్లా వద్ద నరేందర్ లక్కీ డ్రా ప్రచారం చేస్తుండగా, కరాటే కళ్యాణి పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లారు. అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే సమయంలో నరేందర్, అతని అనుచరులు సుమారు 10 మంది తనపై దాడికి యత్నించారని, చున్నీ లాగి అసభ్యంగా ప్రవర్తించారని కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నరేందర్పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 74, 75, 79, 115(2), 132, 351(2), 352 కింద కేసు నమోదు చేశారు.



