నవతెలంగాణ-హైదరాబాద్: మోడీ 11 ఏండ్ల పాలనపై ప్రజలు సున్నా మార్కులు వేశారని కర్నాటక సీఎం సిద్దరామయ్య ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో ప్రచార ఆర్భాటం తప్పా ఏమి లేదని మైసూర్ మీడియా సమావేశంలో విమర్శించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్ర పన్నుల వికేంద్రీకరణలో రాష్ట్రాలకు 50% వాటా ఉండాలని ఆయన అన్నారు, కానీ ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన ఏమి చేశారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన దీనికి విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. కర్ణాటకకు కేంద్రం నుండి అన్యాయం జరిగిందని సిద్ధరామయ్య ఆరోపించారు. కర్ణాటకకు అన్యాయం జరిగిందనీ తాము బీజేపీని అడిగినప్పుడు, తమపై అపవాదులని నిందలు వేశారని కర్నాటక సీఎం గుర్తు చేశారు.
ప్రధాని మోడీ 11 ఏళ్లలో దేశ ముఖ చిత్రాన్ని మార్చేశారని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. జూన్ 9 నాటికి మోడీ ప్రభుత్వం వచ్చి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. దేశంలో మోడీ రాజకీయ సంస్కృతిని మార్చారని.. ప్రభుత్వాన్ని జవాబుదారీగా మార్చారని పేర్కొన్నారు. ఈ 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఊహించలేని విజయాలను సాధించిందని కొనియాడారు. ప్రాముఖ్యంగా భారత రాజకీయ సంస్కృతిలో కొత్త శకానికి నాంది పలికారని ప్రశంసించారు. ఈ 11 ఏళ్ల పరిపాలనను సువర్ణాక్షరాలతో లిఖించొచ్చని చెప్పారు. సాటిలేని అభివృద్ధిని సాధించినట్లు అభిప్రాయపడ్డారు. దేశం అభివృద్ధి చెందడమే కాకుండా.. దేశ భవిష్యత్కు కూడా మంచి ప్రణాళిక వేశారని వెల్లడించారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య సెటైర్లు వేశారు.