– నాటి ఎమర్జెన్సీలో కంటే దారుణ పరిస్థితులు
– మీడియాపై పెరుగుతున్న పాలకుల పెత్తనం
– సర్కారుకు బాకా ఊదుతున్న అనేక సంస్థలు
– మోడీ బ్రాండ్ ఇమేజ్ని పెంచేందుకు కట్టుకథలు
మీడియా నోరు నొక్కేందుకు, దానిపై పెత్తనం చెలాయించేందుకు పదకొండేండ్ల నరేంద్ర మోడీ పాలనలో అనేక ఆంక్షలు విధించారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో సైతం ఇన్ని ఆంక్షలు, అవరోధాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వ విధానాలను విమర్శించే పాత్రికేయులను కటకటాల వెనక్కి నెడుతున్నారు. అనేక మీడియా సంస్థలు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ దానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఓ అడుగు ముందుకు వేసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. పాలక పార్టీ తన సొంత ప్రచారం కోసం, ఇమేజ్ని పెంచుకోవడం కోసం మీడియాను ఉపయోగించుకుంటే అది నియంతృత్వానికి దారితీస్తుందని స్వాతంత్య్రం వచ్చిన మూడు నెలల తర్వాత మహాత్మాగాంధీ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తన ప్రచారం కోసం రేడియోను ఉపయోగించుకుంటోందంటూ వచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. కానీ ఇప్పుడో…? పాలక పక్షాలు మీడియాను తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటూ వాటిపై అజమాయిషీ సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటి, నేటి పరిస్థితులను పోలుస్తూ ‘ది వైర్’ పోర్టల్ కోసం మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన కేఎన్ సాహూ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం…
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ నాడు 19 నెలల పాటు దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. మీడియాను నియంత్రించారు. సెన్సార్షిప్ను అమలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని వార్తాపత్రికలపై చర్యలు చేపట్టారు. ‘ఇందిరాగాంధీ మీడియాను వంగమని అడిగితే అది పూర్తిగా సాష్టాంగపడింది’ అని ఆనాడు ఎల్కే అద్వానీ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆయన వారసులమని చెప్పుకుంటున్న నేతలు మీడియాను తమ అదుపాజ్ఞల్లో ఉంచుకుంటున్నారు.
గాంధీజీ మాటలకు విలువేది?
గడచిన 11 ఏండ్ల మోడీ పాలనలో అధికారికంగా ఎమర్జెన్సీని ప్రకటించలేదు. అయినప్పటికీ ప్రస్తుతం మీడియా పరిస్థితి నాటి ఎమర్జెన్సీ కాలం నాటి కంటే మరింత దారుణంగా తయారైంది. నాటి మహాత్మాగాంధీ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పాలక పార్టీ మీడియాను తన సొంత ప్రచారం కోసం వాడుకుంటోంది. ఫలితంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు దెబ్బతింటున్నాయి. అనేక మంది ముస్లింలను పొట్టనపెట్టుకున్న 2002 నాటి గుజరాత్ హింస నుంచి మీరు నేర్చుకున్న పాఠాలేమిటని బీబీసీ ప్రతినిధి మోడీని ప్రశ్నించినప్పుడు ఎంతమంది ప్రాణాలను కాపాడి ఉండి ఉండాల్సిందో ఆయన చెప్పలేదు. దానికి బదులుగా మీడియాను మరింత మేనేజ్ చేసి ఉండాల్సిందని అన్నారు. ఎందుకంటే ఆనాటి మత ఘర్షణలలో జరిగిన అల్లర్లు, మోడీ నాయకత్వం గురించి మీడియాలో అనేక విమర్శనాత్మక కథనాలు వచ్చాయి.
సెక్యులర్, సోషలిస్ట్ పదాలే వద్దట
మోడీ హయాంలో ప్రధాన స్రవంతి టీవీ ఛానల్స్, ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియా, చివరికి సోషల్ మీడియా కూడా అధిక భాగం మోడీ ఇమేజ్ని పెంచడానికి, బీజేపీ పక్షాన ప్రచారం చేయడానికి, ద్వేషంతో కూడిన కల్పిత వార్తలను అందించడానికి తన వంతు కృషి చేసింది. ‘గోడీ మీడియా’గా పేరుగాంచిన ఈ సంస్థలు బీజేపీకి బాకాగా మారాయి. సమాచారాన్ని ఓ వస్తువుగా మార్కెటింగ్ చేయడంలో, ముస్లింలకు వ్యతిరేకంగా విషం కక్కడంలో అవి పాలకులకు బాగా సాయపడ్డాయి. హిందూత్వలో వేళ్లూనుకుపోయిన మోడీ బ్రాండ్ ఇమేజీని దూకుడుగా ప్రచారం చేయడం ద్వారా ఆ సంస్థలు రాజ్యాంగ ధృక్పథాన్ని, లౌకిక సంప్రదాయాలను ప్రమాదంలో పడేశాయి. నాటి ఎమర్జెన్సీ పాలనలో సమాజాన్ని మత ప్రాతిపదికన విడగొట్టే ప్రయత్నం జరగలేదు. వాస్తవానికి ఇందిరాగాంధీ రాజ్యాంగ పీఠికలో ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ అనే పదాలను చేర్చడం ద్వారా తన విశ్వసనీయతను చాటుకునే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇటీవల ఆ చర్యను సమర్ధించింది. అయితే ఆ పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ నేతలు ఇప్పుడు కోరుకుంటున్నారు.
ఇది ‘ఎన్నుకోబడిన నియంతృత్వం’
ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత దేశంలో మీడియా ఆంక్షలు తొలగిపోయాయి. లోక్సభ ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవడం, జనతా పార్టీ అధికారంలోకి రావడం తెలిసిందే. కానీ గత 11 ఏండ్ల పాలనలో ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారక్ అయిన మోడీ పాలనా వ్యవహారాలపై పూర్తి పట్టు సాధించారు. ఎమర్జెన్సీని అధికారికంగా ప్రకటించకపోయినా మీడియాపై అనేక రకాల ఆంక్షలు విధించారు. రాజ్యాంగం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ కోవిదుడు రాజీవ్ ధావన్ చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా గమనార్హం. భారత్ ఇప్పుడు ‘ఎన్నుకోబడిన నియంతృత్వం’గా కుదించుకుపోయిందని ఆయన తెలిపారు.
నియంతృత్వ పోకడలకు దర్పణం
పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ ఇప్పుడు 151వ స్థానంలో (మొత్తం 180 దేశాలు) నిలిచింది. దేశంలోని పలువురు పాత్రికేయులను కఠిన చట్టాలను ప్రయోగించి అరెస్ట్ చేశారు. న్యూస్క్లిక్ పోర్టల్ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహా పలు సంస్థల దాడులకు గురైంది. ఇటీవలే ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా అనేక యూట్యూబ్ ఛానల్స్ను, ది వైర్ వెబ్సైటును ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైనిక విమానాలకు జరిగిన నష్టానికి సంబంధించిన వార్తను తొలగించిన తర్వాతే వైర్ పోర్టల్కు అనుమతి ఇస్తామని చెప్పింది. విధిలేని పరిస్థితుల్లో సంపాదకులు అందుకు అంగీకరించిన తర్వాతే పోర్టల్ను పునరుద్ధరించారు. హత్రాస్లో ఓ దళిత బాలికపై జరిగిన లైంగికదాడి, హత్య ఘటనకు సంబంధించిన వార్తను అందించిన జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూకాశ్మీర్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిలిపివేయడం, శ్రీనగర్లో ప్రెస్క్లబ్ను మూసేయడం వంటి చర్యలు నియంతృత్వ పోకడలకు అద్దం పడుతున్నాయి.
గడచిన 11 ఏండ్ల కాలంలో అనేక బూటకపు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. విశ్వాసం, ఆహారం పేరుతో వ్యక్తులు, గ్రూపులు పౌరులను హతమార్చడానికి ఇవి ప్రేరణగా నిలిచాయి. మెరుగైన టీఆర్పీ రేటింగ్ కోసం టీవీ ఛానల్స్ ద్వేషపూరిత కథనాలు ప్రసారం చేస్తున్నాయని సుప్రీంకోర్టు సైతం చురకలు వేసింది. అయినప్పటికీ అలాంటి ఛానల్స్పై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.