Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుప'రేషన్‌'లో మిల్లర్లు…!

ప’రేషన్‌’లో మిల్లర్లు…!

– సన్నబియ్యం పంపిణీతో పడిపోయిన డిమాండ్‌
– ఎగుమతుల్లేక మిల్లుల్లో బియ్యం స్టాక్‌
– ఐదేండ్లుగా అందని సీఎంఆర్‌ బిల్లులు
– ప్రభుత్వం కనికరించాలి : మిల్లర్లు
సన్న బియ్యం అమ్మకాలపైనే ఆధారపడిన మిల్లర్లకు ప్రభుత్వం ఇప్పుడు రేషన్‌షాపుల ద్వారా పేదలకు సన్నబియ్యం ఇస్తుండటంతో మార్కెట్‌ డిమాండ్‌ పూర్తిగా పడిపోయింది. గతంలో కంటే 80శాతం మేరకు మార్కెట్‌లో సన్నబియ్యం డిమాండ్‌ లేకపోవడంతో తమ వద్ద ఉన్న సరుకును ఎలా అమ్ముకోవాలో తెలియడం లేదని మిల్లర్లు అంటున్నారు. గత వానాకాలం సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యంలో 20శాతం మేరకు నిల్వ ఉండగా.. ఇప్పుడు కొనుగోలు చేసిన ధాన్యంతో గోదాములు ఖాళీగా లేకుండా ఉన్నాయంటున్నారు.
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 360కు పైగా మిల్లులు ఉన్నాయి. ఇందులో నల్లగొండ జిల్లాలో 190, సూర్యాపేట జిల్లాలో 100, యాదాద్రి భువనగిరి జిల్లాలో 70 ఉన్నాయి. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో 90కు పైగా పెద్ద మిల్లులే ఉండగా.. ఇక్కడి నుంచి అత్యధికంగా సన్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. మిగిలిన మిల్లులన్ని ఎక్కువగా సీఎంఆర్‌ కిందనే పని చేస్తున్నాయి.
పెరిగిపోతున్న మిల్లింగ్‌ చార్జీలు
ధాన్యాన్ని కొనుగోలు చేసిన మిల్లర్లు దాన్ని బియ్యంగా మార్చేందుకు మిల్లింగ్‌ చేసి బస్తాల్లో నింపి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. క్వింటాకు రూ.2300కు సన్నరకం ధాన్యం కొనుగోలు చేస్తే.. దానిలో తేమను తగ్గించేందుకు తరుగు, డ్రై చార్జ్‌ రూ.300 నుంచి రూ.400 వరకు ఖర్చు వస్తుంది. దీంతో క్వింటాకు రూ.2700 వరకు ధర పడుతుంది. దాన్ని మిల్లింగ్‌ చేస్తే 55కేజీల బియ్యం, 10 కేజీల నూక వస్తుంది. 55కేజీల బియ్యానికి రూ.2700 ఖర్చయితే.. మిల్లులకు కిలో బియ్యానికి హెచ్‌ఎంటీకి రూ.45, ఇతర ఫైన్‌ క్వాలిటీకి రూ.48 ఖరీదు అవుతుంది. బ్యాగ్‌లు, ఎగుమతుల చార్జీలు, హమాలీల ఖర్చులు కలుపుకుంటే కనీసం రూ.5 ఖర్చు అవుతుంది. కానీ మార్కెట్‌లో హెచ్‌ఎంటీ క్వింటా రూ.4500, ఇతర సన్న రకాలకు రూ.4800 ధర పలుకుతోంది. అంటే మొత్తంగా 200 నుంచి 300 నష్టం వస్తుంది. హెచ్‌ఎంటీ రకం బియ్యానికి హైదరాబాద్‌లోనే మార్కెటింగ్‌ ఉంటుంది. రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం ఇస్తుండటంతో హైదరాబాద్‌లో హెచ్‌ఎంటీ రకం బియ్యం అడిగేవారు లేరని మిల్లర్లు చెబుతున్నారు. దీంతో ధర పడిపోయిందని వాపోతున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే సన్నరకం బియ్యం డిమాండ్‌ కూడా పడిపోయింది.
రైస్‌ భాగ్య పథకాన్ని రద్దు చేసుకున్న ప్రభుత్వం
గతంలో బియ్యానికి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో కర్నాటక ప్రభుత్వం రేషన్‌ షాపుల్లో బియ్యానికి బదులు రైస్‌ భాగ్య పథకాన్ని(నగదు బదిలీ) అమలు చేసింది. రేషన్‌కార్డు దారులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులకు మరికొన్ని కలుపుకోని బియ్యం కొనుక్కునే వారు. కానీ ఆ రాష్ట్రంలో ధాన్యం ఎక్కువగా దిగుబడి రావడంతో రైస్‌ భాగ్య పథకాన్ని రద్దు చేసి రేషన్‌షాపుల్లో బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇదే తరహాలో బీహార్‌, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్రతోపాటు అత్యధిక రాష్ట్రాల్లో ధాన్యం దిగుబడి అధికంగా వచ్చింది. ప్రస్తుతం తెలంగాణాలో రేషన్‌ షాపుల్లో బీపీటీ సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా రాబోయే 9 నెలలకు కావాల్సిన స్టాక్‌ ప్రభుత్వం అందుబాటులో ఉంచుకుంది. దీంతో సన్న బియ్యాన్ని ప్రయివేట్‌ మార్కెట్‌లో కొనే పరిస్థితి ఉంటుందా? అన్న భయాలు మిల్లర్లలో ఉన్నాయి.
పెండింగ్‌లో రూ.600 కోట్ల సీఎంఆర్‌ చార్జీలు
ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి బియ్యాన్ని అప్పగించేందుకుగాను సీఎంఆర్‌ కింద ప్రతి సీజన్‌లోనూ మిల్లులకు ధాన్యాన్ని కేటాయిస్తుంటారు. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 270కుపైగా మిల్లులు సీఎంఆర్‌ పైనే ఆధారపడి నడస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో వందకు పైగా, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పూర్తిగా సీఎంఆర్‌పైనే ఆధారపడి ఉన్నాయి. గత పది సీజన్ల నుంచి సీఎంఆర్‌ బియ్యం అందించినందుకుగాను ప్రభుత్వం నుంచి మిల్లులకు మిల్లింగ్‌ చార్జీల పేరిట కోట్ల రూపాయల బాకీ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.600కోట్లకు పైగా మిల్లింగ్‌ చార్జీలు రావాల్సి ఉంది. చార్జీలు ఇవ్వాలని మిల్లర్లు పలుమార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఫలితం దక్కడం లేదు. పైగా మిల్లుల వద్ద గన్ని సంచులు పెండింగ్‌లో ఉన్నాయని సాకులు చెప్పి దానికిగాను మిల్లింగ్‌ చార్జీలు సరిపోతాయని ప్రభుత్వం నుంచి సమాధానం రావడంతో మిల్లర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పెండింగ్‌ సీఎంఆర్‌ బిల్లులు చెల్లించాలి
మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మిల్లుల ద్వారా గత సీజన్‌లో చేసిన మిల్లింగ్‌ చార్జీలు కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. గన్ని సంచుల పెండింగ్‌ కారణంతో బిల్లులు ఇవ్వడం లేదు. చినిగిపోయిన, పనికిరాని బస్తాలకు రూ.21 ధర నిర్ణయించడం వల్ల మిల్లర్లకు తీవ్ర నష్టం జరుగుతోంది. మిల్లుల వద్ద ఉన్న గన్ని సంచులను ప్రభుత్వం తీసుకొని మిల్లింగ్‌ చార్జీలను వెంటనే చెల్లించాలి.
– వెంకటరమణ చౌదరి (మిర్యాలగూడ మిల్లర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి)

మా ఇబ్బందులను గుర్తించాలి
కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మిల్లులను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న మిల్లర్ల ఇబ్బందులను కూడా ప్రభుత్వం గుర్తించాలి. ప్రస్తుతం రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో అన్ని రకాలుగా సహకారం అందించాం. అయినప్పటికీ మాపై నిందలు, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో సన్న బియ్యానికి డిమాండ్‌ లేకపోవడంతో మిల్లుల్లో ధాన్యం పెద్దఎత్తున పేరుకుపోయింది. అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నాం. స్టాక్‌ ఉన్న నిల్వలకు వడ్డీ, తరుగును పరిగణించనట్లయితే నష్టాలే వస్తాయి.
– సంతోష్‌రెడ్డి, (మిర్యాలగూడ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img