Wednesday, April 30, 2025
Homeజాతీయంబెంగాల్‌లో వక్ఫ్‌ ఆందోళనలు హింసాత్మకం

బెంగాల్‌లో వక్ఫ్‌ ఆందోళనలు హింసాత్మకం

– ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
– 118మంది అరెస్టు
– వక్ఫ్‌ చట్టాన్ని అమలు చేయం : మమతా బెనర్జీ ప్రకటన
కోల్‌కతా:
పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో వక్ఫ్‌ (సవరణ) చట్టాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ హింసాకాండలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మత ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం సుతిలో జరిగిన పోలీసు కాల్పుల్లో గాయపడిన ఇజాజ్‌షేక్‌ ముర్షీదాబాద్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతి చెందారని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
దోషులపై కఠిన చర్యలు : సీఎం మమతా బెనర్జీ
దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ఆందోళనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్‌ సవరణ చట్టాన్ని అమలు చేసేది లేదని ఆమె ప్రకటించారు. ఈ చట్టాన్ని చేసింది కేంద్రమని, రాష్ట్ర ప్రభుత్వం కాదని, తాము దీనికి మద్దతునివ్వడం లేదని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేయనప్పుడు ఇక గొడవ దేనికి అని ప్రశ్నించారు.కాగా ఈ నెల 16న వక్ఫ్‌ చట్టంపై సుప్రీం విచారణ చేపట్టనుంది.
118మంది అరెస్టు
ముర్షిదాబాద్‌, దక్షిణ 24 పరగణాలు, హూగ్లీ జిల్లాల్లో శుక్రవారం హింసాకాండ చెలరేగిన విషయం తెలిసిందే. పోలీసు వ్యాన్లతోసహా అనేక వాహనాలకు నిప్పంటించారు. భద్రతా బలగాలపై రాళ్లు విసిరారు. రహదారులపై ట్రాఫిక్‌ను అడ్డగించారు. ఈ నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇప్పటివరకు 118 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. పుకార్లు, తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం వల్ల సంఘ వ్యతిరేక శక్తులు, కొంతమంది దుండగులు రెచ్చిపోతున్నారని, వారివల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని అదనపు డీజీ (శాంతి భద్రతలు) జావేద్‌ షామిమ్‌ తెలిపారు. జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున అడ్డంకులు సృష్టించడంతో పోలీసులు రంగంలోకి దిగారని, ఈ ఘర్షణల్లో 18మంది పోలీసులకు గాయాలయ్యాయని అన్నారు.
శాంతిభద్రతలను కాపాడాలి : లెఫ్ట్‌ఫ్రంట్‌ డిమాండ్‌
బీజేపీ – తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు విభజన రాజకీయాలకు పాల్పడటం, పోలీసులు సకాలంలో జోక్యం చేసుకోకపోవడం వల్లే హింస చెలరేగిందని లెఫ్ట్‌ ఫ్రంట్‌ ముర్షీదాబాద్‌ జిల్లా కన్వీనర్‌ జమీర్‌ ముల్లా విమర్శించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హింసాత్మక ప్రాంతాల్లో శుక్రవారం తమ బృందం పర్యటించినట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే మత అల్లర్లు జరిగాయని విమర్శించారు. ఇంత జరిగినా శనివారం ఉదయం ధులియన్‌ బజార్‌లో బీజేపీ ర్యాలీకి ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. శాంషేర్‌గంజ్‌, సూతి-2 బ్లాక్‌లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సైనిక బలగాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా స్థాయిలోనూ, ప్రతి బ్లాక్‌లోనూ అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img