– బందీపొరాలో ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్ర మూకలపై భద్రతా దళాలు తుపాకులు గర్జిస్తున్నాయి. తాజాగా లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న వారి కోసం జల్లెడపడుతున్న భద్రతా దళాలకు బందీపొరాలో అల్తాఫ్ ఆచూకీ తెలిసింది. శుక్రవారం ఉదయం ఆర్మీ-పోలీసు దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈక్రమంలో ఉగ్రవాదులను గుర్తించడంతో ఎన్కౌంటర్ మొదలైంది. తొలుత ఓ ఉగ్రవాది గాయపడ్డాడు. ఆ తర్వాత భద్రతా దళాల్లోని అధికారి బాడీగార్డులకు తూటాలు తాకాయి. ఈక్రమంలో అల్తాఫ్ను మట్టుబెట్టాయి. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కాశ్మీర్లో అడుగుపెట్టిన వేళ ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం.
పహల్గాం ఉగ్రమూకకు నేరుగా హఫీజ్ సయీద్తో లింకులు
పహల్గాంలో ఉగ్రదాడి వెనక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర నేరుగా ఉన్నట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కాశ్మీర్లో చురుగ్గా పనిచేస్తున్న మాడ్యూల్ను అతడే స్వయంగా నియంత్రిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఉగ్రబృందం కొన్నేండ్ల నుంచి ఇక్కడ చాలా దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం. గత రెండేండ్లలో జరిగిన సోనమార్గ్, బూటపత్రి, గందర్బాల్ జరిగిన హైప్రొఫైల్ దాడుల్లో కూడా ఇవి పాల్గొన్నాయి. గతేడాది అక్టోబర్లో బూటపత్రిలో ఇద్దరు ఆర్మీ సిబ్బందిని హత్య చేసింది. అదే నెలలో సోనమార్గ్ సొరంగంలో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులను కాల్చిచంపింది. ఈ ఉగ్ర బృందంలో కీలక సభ్యుడైన జునైద్ అహ్మద్ భట్ను డిసెంబర్లో భద్రతా దళాలు దాచిగామ్ వద్ద ఎన్కౌంటర్ చేశాయి. మిగిలిన ఉగ్రవాదులు పారిపోయారు. ఆ తర్వాత ఈ బృందం చాలాకాలం అడవుల్లో ఎవరి కంటా పడకుండా గడిపింది.
లష్కరే టాప్ కమాండర్ హతం
- Advertisement -