– రూ. 83, 977 కోట్ల కేటాయింపులు
– సముద్రయాన బీమా కవరేజీకి రూ. 12,980 కోట్లు
– కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
– కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన మూడోదశ 2028 వరకు కొనసాగింపునకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ. 83,977 కోట్ల కేటాయింపులు జరుగుతాయి. భారత్ మ్యారీ టైం ఇన్సూరెన్స్ పూల్ ఏర్పాటు ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
నిరంతర సముద్రయాన బీమా కవరేజీ కోసం రూ.12,980 కోట్లు కేటాయించారు. ప్రపంచ అస్థిరత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నౌకల బీమా కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. యుద్ధ ప్రమాద నష్టాలను కవర్ చేసేలా బీమా ఉంటుంది.
రాజమండ్రి (నిడదవోలు)-(దువ్వాడ) మధ్య 3, 4వ రైల్వే లైన్ ట్రాక్ ఏర్పాటుకూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 198 కిలోమీటర్ల రూట్లో, 458 కిలో మీటర్ల ట్రాక్ ఏర్పాటు కానుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.9,889 కోట్లు ఖర్చు చేయనుంది.
మరిన్ని కీలక నిర్ణయాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అదనపు డీఏ నిధుల విడుదలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదనంగా పెరిగిన ఈ రెండు శాతం డీఏ ఈ ఏడాది జనవరి నుంచి అమలు కానుంది. ఈ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై రూ. 6,791 కోట్ల అదనపు భారం పడనుంది. 50.46 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68.27 శాతం పెన్షన్ దారులకు ప్రయోజనం చేకూరుతుంది. అదే విధంగా ఘజియాబాద్, సీతాపూర్ థర్డ్, ఫోర్త్ రైల్ లైన్ విస్తరణకు రూ. 14,926 కోట్లు కేటాయింపు.
పీఎంజీఎస్వై మూడో దశ కొనసాగింపునకు ఆమోదం
- Advertisement -
- Advertisement -



