Thursday, May 15, 2025
Homeజాతీయంమహిళలు రాఫెల్‌నే నడిపితే ఆర్మీ లీగల్‌ పోస్టులు ఎందుకు ఇవ్వరు?

మహిళలు రాఫెల్‌నే నడిపితే ఆర్మీ లీగల్‌ పోస్టులు ఎందుకు ఇవ్వరు?

- Advertisement -

– కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ:
భారత వైమానిక దళంలో ఒక మహిళ రాఫెల్‌ యుద్ధ విమానాన్ని నడపగలిగినపుడు, ఆర్మీలోని జడ్జి అడ్వకేట్‌ జనరల్‌ (లీగల్‌) పోస్టుల్లో కొద్దిమంది మహిళా అధికారులు మాత్రమే ఎందుకు వున్నారని సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని నిలదీసింది. ఈ పోస్టుల్లో మహిళలు తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ పోస్టులకు 50-50 నిబంధన వర్తించినప్పటికీ మహిళలను ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించింది. ఇద్దరు మహిళా అధికారులు అర్షనూర్‌ కౌర్‌, ఆస్థా త్యాగిలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం మే 8న తమ తీర్పును రిజర్వ్‌ చేసింది. ఆ ఇద్దరు మహిళా అధికారులు ఆర్మీలోని జడ్జి అడ్వకేట్‌ జనరల్‌ లీగల్‌ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల్లో వరుసగా 4, 5 ర్యాంకులు సాధించారు. పురుషుల కన్నా మెరిట్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ, మహిళలకు కేటాయించిన ఖాళీలు తక్కువగా ఉండటం వలన జెఎజి విభాగానికి తమను ఎంపిక చేయలేదని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఖాళీలను భర్తీ చేసే విషయంలో మహిళలు, పురుషుల మధ్య గల అసమానతలను ఈ పిటిషన్‌లో వారు సవాలు చేశారు. మొత్తం ఆరు పోస్టులకు గానూ మహిళలకు మూడు ఖాళీలు మాత్రమే ఉన్నందున వారిని ఎంపిక చేయలేమని అధికారులు చెప్పారని తెలిపారు. భారత వైమానిక దళంలో ఒక మహిళ రాఫెల్‌ యుద్ధ విమానం నడపడానికి అనుమతి ఉంటే, జెఎజిలో ఎక్కువ మంది మహిళలను అనుమతించడంలో ఆర్మీకి కష్టమేముందని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. జెఎజి పోస్టులు లింగబేధంతో సంబంధం లేని తటస్థ పోస్టులైనప్పటికీ.. మహిళలకు ఎందుకు తక్కువ పోస్టులు కేటాయించారని ప్రశ్నించింది. పురుషులు, మహిళలు ప్రాతిపదికన ఖాళీలను విభజించడం వలన అధిక అర్హత కలిగిన మహిళా అభ్యర్థులను ఆ పోస్టులకు తీసుకోనపుడు.. వాటిని లింగ తటస్థ పోస్టులని ఎందుకు పిలుస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 10మంది మహిళలు జెఎజికి అర్హత సాధిస్తే, వారందరినీ జెఎజి బ్రాంచ్‌ అధికారులుగా నియమిస్తారా అని జస్టిస్‌ మన్మోహన్‌ ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -