– మూడున్నరేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు
– భూభారతితో భూ సమస్యల పరిష్కారం : మంత్రులు శ్రీధర్బాబు, శ్రీనివాస్రెడ్డి
నవతెలంగాణ- ఎలిగేడు
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ప్రజా పాలన ముందుకు సాగుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ను రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావుతో కలిసి శుక్రవారం మంత్రులు ప్రారంభించారు. అలాగే జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో జిల్లాలో పట్టపగలే న్యాయవాద దంపతులను నరికి చంపిన నాయకులను కేసుల నుంచి తప్పించేందుకే ‘ఫ్రెండ్లీ పోలీస్’ పని చేసిందని విమర్శించారు. ప్రస్తుతం సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా.. శాంతి భద్రతలను పరిరక్షించేలా పోలీస్ వ్యవస్థ పని చేస్తోందన్నారు. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చే సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా సమస్యలను పరిష్కరించి వారి అభిమానాన్ని పొందాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలను, వసతులను ప్రజా ప్రభుత్వం మెరుగు పర్చిందన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సతీమణి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకుని ప్రజల్లో చైతన్యం కల్పించినందుకు జిల్లా కలెక్టర్ను మంత్రి అభినందించారు. ఎలిగేడు మండల ప్రజల కోసం రాబోయే విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజయ రమణారావు కోరగా, అందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ పాలకులు విచ్ఛిన్నం చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. గత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే నూతనంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజా ప్రభుత్వం చేపట్టిందన్నారు. ధరణి చట్టం వల్ల కేవలం ఒకే కుటుంబ సభ్యులు మాత్రమే లబ్ది పొందారని, అనేక మంది రైతులకు కన్నీళ్లు మిగిల్చిన ఆ చట్టాన్ని బంగాళాఖాతంలో వేశామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి అద్భుతమైన భూభారతి చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. రానున్న మూడున్నర ఏండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ప్రతి పేదవారికీ ఇల్లు ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మెన్ నరేందర్రెడ్డి, డీసీపీ కరుణాకర్, అదనపు కలెక్టర్లు డి.వేణు, జె.అరుణశ్రీ, రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అన్నయ్యగౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజాపాలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES