– ఎనిమిది మంది మావోయిస్టులు మృతి
– మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ హతం
– ఆయనపై రూ.కోటి రివార్డు
– ఎదురుకాల్పుల పేరిట నరమేధం : పౌరహక్కుల సంఘాలు
బోకారో: జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ ఉన్నట్టు సమాచారం. అతడిపై ప్రభుత్వం రూ.కోటి రివార్డ్ను కూడా ప్రకటించింది. సోమవారం ఉదయం బొకారో జిల్లాలోని లాల్పానియా ప్రాంతంలో సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా దళం, రాష్ట్ర పోలీసులు నిఘా వర్గాల సమాచారంతో సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 5.30 గంటల సమయంలో కొండల ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడినట్టు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. దీంతో ఇరుపక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయినట్టు వెల్లడించారు. మృతులను గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఎస్ఎల్ఆర్, రెండు ఇన్సాస్ రైఫిల్, ఒక పిస్టల్తో పాటు ఎనిమిది మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు. అయితే భద్రతా దళాల్లో ఎవరూ గాయపడలేదని, కాల్పులు కొనసాగుతున్నాయని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. అయితే అడవుల్లో ఎదురు కాల్పుల పేరిట భద్రతా బలగాలు నరమేధానికి పాల్పడుతున్నాయని ప్రజాహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. 2026 మార్చి నాటికి మావోయిస్టుల్లేకుండా చేస్తామని కేంద్రహౌంమంత్రి అమిత్షా చెబుతున్నట్టుగానే..ఆధునిక టెక్నాలజీని వినియోగించి మావోయిస్టులను మట్టుబెడుతున్నట్టు స్పష్టమవుతోందని వారు తెలిపారు.
జార్ఖండ్లో ఎన్కౌంటర్
- Advertisement -
- Advertisement -