Wednesday, June 4, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'దేశాభివృద్ధి' అంటే జీడీపీ వృద్ధి మాత్రమేనా?

‘దేశాభివృద్ధి’ అంటే జీడీపీ వృద్ధి మాత్రమేనా?

- Advertisement -

లాభార్జనే లక్ష్యంగా పరిగణించే పెట్టుబడిదారులు ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఒకానొక దేశం అభివృద్ధి చెందిందా లేదా అన్నదానికి ఆ దేశం దగ్గర ఎంత బంగారం లేదా వెండి వంటి విలువైన లోహాలు ఉన్నాయి అన్నది కొలమానంగా ఉంటుంది. ఒక దేశం ఎంతగా అభివృద్ధి చెందుతోంది అన్నదానికి ఆ దేశం ఆ విలువైన లోహాల నిల్వలను ఎంత మేరకు పెంచుకోగలిగింది అన్నది కొలమానంగా చూసేవారు. ఒక దేశం దగ్గర బంగారం, వెండి నిల్వలు పెరగాలంటే ఆ దేశం ఇతర దేశాలతో చేసే వ్యాపారంలో మిగులు ఉండాలి. అంటే దిగుమతుల విలువ కన్నా ఎగుమతుల విలువ ఎక్కువగా ఉండాలి. ఆ విధంగా వ్యాపారంలో ఏర్పడిన మిగులుకు సమానమైన విలువ ఉన్న బంగారాన్ని దిగుమతి చేసుకునేది ఆ దేశం. దాని వలన తన దగ్గర బంగారం నిల్వలు పెరిగేవి. భారతదేశాన్ని పాలించిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఇటువంటి దృక్పథాన్నే కలిగివుండేది.
ఆడంస్మిత్‌ ఈ దృక్పథాన్ని గట్టిగా తూర్పారబట్టాడు. తన ప్రసిద్ధ గ్రంథం ”ది వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌” (దేశాల సంపద)లో ఒక దేశం వద్ద ఎంత బంగారం నిల్వ ఉంది అన్నది ఆ దేశ సంపదకు కొలమానంగా చూడడం సరైనది కాదని, ఆ దేశంలో సంపదను ఉత్పత్తి చేసే యంత్రాలు, ముడిసరుకులు వంటివి (కేపిటల్‌ స్టాక్‌) ఎంత ఉందన్నదే ఆ దేశ సంపదకు అసలైన కొలమానం అని ఆడం స్మిత్‌ ప్రతిపాదించాడు. ఆ సంపద ఎటువంటి ఆటంకాలూ లేకుండా అభివృద్ధి చెందాలంటే ఆ దేశం పెట్టుబడుల మీద, మార్కెట్‌ మీద ఎటువంటి ఆంక్షలూ లేని ‘స్వేచ్ఛాయుత పోటీ’ వాతావరణాన్ని నెలకొల్పాలని అతడు సూత్రీకరించాడు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ తదితర గుత్త సంస్థలు రాజ్యం మీద చెలాయిస్తున్న పెత్తనం వంటివి కొనసాగకుండా చూస్తేనే స్వేచ్ఛాయుత పోటీ వాతావరణం ఏర్పడగలదని చెప్పాడు.
అంతవరకూ ఉన్న దృక్పథానికి పూర్తి భిన్నంగా ఆడం స్మిత్‌ అవగాహన ఉంది. కాని ఇక్కడ ప్రత్యేకంగా కొట్టవచ్చినట్టు కనిపించేదేమంటే ఆడం స్మిత్‌ కూడా ”దేశం” మీదే దృష్టిని కేంద్రీకరించాడు తప్ప ”ప్రజల” మీద కాదు. బంగారం, వెండి మాత్రమే సంపదగా భావించే బదులు మొత్తం కేపిటల్‌ స్టాక్‌ అంతటినీ సంపదగా చూడాలని చెప్పాడే కాని అసలు ఎవరి సంపద గురించి మాట్లాడుతున్నామో వారిని (ప్రజలను) పరిగణనలోకి తీసుకోనేలేదు.
పదిహేడవ శతాబ్దంలో యూరప్‌ ఖండంలో అప్పటి వరకూ ఎడతెగకుండా సాగుతున్న యుద్ధాలకు ముగింపు పలుకుతూ ఆ యా దేశాల సరిహద్దులను నిర్ణయించుకోడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు (వెస్ట్‌ ఫాలియన్‌ ట్రీటీస్‌). అప్పటికి యూరప్‌లో బూర్జువా జాతీయవాదం ప్రబలంగా ఉండేది. అది బాగా ముదిరి 1930వ దశకం నాటికి ఫాసిజం రూపం తీసుకుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే బూర్జువా దృక్పథంలో మొదటి నుంచీ దేశం అంటే ప్రజలతో నిమిత్తం లేకుండా వారికన్నా ఉన్నతంగా ఉండే ఒక అస్తిత్వం అన్న భావన కొనసాగుతోంది.
ఇక్కడ దేశం అనేది ప్రజలకన్నా ఉన్నతమైనది అంటూనే మరోవైపు జాతీయ ప్రయోజనాలు లేదా దేశ ప్రయోజనాలు అంటే మాత్రం ఆ దేశంలో ఉండే బూర్జువా వర్గపు ప్రయోజనాలుగానే గుర్తించడం జరుగుతోంది. వ్యాపారమే ప్రధాన లాభార్జన మార్గంగా ఉన్న కాలంలో వారి ప్రయోజనాలే దేశానికి అత్యున్నత ప్రయోజనాలుగా గుర్తించే పరిస్థితి ఉండేది. ఆడం స్మిత్‌ సూత్రీకరణతో దేశ ప్రయోజనాలు లేదా జాతీయ ప్రయోజనాలు అంటే వస్తూ త్పత్తి చేసే పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే అన్న దృక్పథం వచ్చింది. ఈ మార్పు వచ్చినప్పటికీ, జాతీయ ప్రయో జనాలు అంటే ప్రజల ప్రయోజనాలు కావని, ప్రజలకన్నా ఉన్నతమైన స్థాయిలో ఉండే ప్రయోజనాలు అని తొలి నుండి ఉన్న అవగాహన మాత్రం కొనసాగింది.
డేవిడ్‌ రికార్డో కూడా ఆడం స్మిత్‌ మాదిరిగానే అభివృద్ధి అంటే దేశంలో పెట్టుబడుల అభివృద్ధి అని భావించాడు. అయితే దేశంలో పెట్టుబడుల వృద్ధి ఎప్పుడైతే ఇక పెరగకుండా నిలిచిపోతుందో అప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ఇక కదలిక కోల్పోయి నిశ్చలమైపోతుందని భయపడ్డాడు. ఈ విషయంలో జేమ్స్‌ స్టువార్ట్‌ మిల్‌ మాత్రం నిశ్చయంగా ఒక మినహాయింపు అనే చెప్పాలి. ఒక దేశం ఆర్థిక వ్యవస్థ నిశ్చలమైనంత మాత్రాన భయపడనవసరం లేదని, అటువంటి నిశ్చల స్థితిలో కార్మికులు గనుక మెరుగైన ఆదాయాలను అంతకు మునుపటికన్నా (పెట్టుబడి వృద్ధి చెందుతున్నప్పటి కన్నా) పొందగలుగుతూ వుంటే ఏ ఇబ్బందీ ఉండదని అతడు చెప్పాడు. తన పూర్వపు ఆర్థికవేత్తలు ఆడం స్మిత్‌, రికార్డోలకు భిన్నంగా మిల్‌ పెట్టుబడుల వృద్ధి కన్నా కార్మికుల ప్రయోజనాలకే పెద్దపీట వేశాడు. అయితే మామూలుగా సాంప్రదాయ పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్ధించే మిల్‌ ఈ విధంగా ఒక విధమైన సోషలిస్టు ఆలోచన వైపు మొగ్గడం వెనుక అతడి భార్య హారియట్‌ ప్రభావం ఉంది.
కేవలం పెట్టుబడుల వృద్ధికే పెద్దపీట వేసినందుకు, శ్రామిక వర్గ సంక్షేమాన్ని విస్మరించినందుకు ఆడం స్మిత్‌ను, రికార్డోను మనం మరీ అంతగా విమర్శించనక్కరలేదు. నిజానికి వారిద్దరికీ కార్మికుల పట్ల సానుభూతి వుంది. అయితే కార్మికుల భౌతిక జీవన స్థితిగతులు మెరుగుపడితే వారు మరింత ఎక్కువ సంతానాన్ని కని వృద్ధి చేయగలరని వారు తలిచారు (మాల్థూస్‌ జనాభా సిద్ధాంతం). నిజ వేతనాలు ఒకానొక స్థాయిని దాటి పెరిగితే అప్పుడు పనిచేసే కార్మికుల సంఖ్య కూడా ఆ మేరకు పెరుగుతుంది అనుకున్నారు. వేతనాలు పెరగాలంటే కార్మికులు ఇంకా బాగా పని చేయాలని, అప్పుడు సంపద పెరిగి దానితోబాటు కార్మికుల ఆదాయాలు కూడా పెరుగుతాయని వారనుకున్నారు. ఆ విధంగా కార్మికుల జీవితాలు మెరుగుపడడం అనేది ఆ కార్మికుల చేతుల్లోనే ఉందని వారు తలిచారు. కార్మికులు మరింత మెరుగైన ఆదాయాలను పొందగలగాలంటే, తమ స్థితిగతులను మెరుగు పరుచుకోవాలంటే వారు తమ సంతానాన్ని పరిమితం చేసుకోవడం, తమ అలవాట్లను నియంత్రించుకోవడం వంటివి చేయాలని చెప్పారు. ఒక దేశం అనుసరించే విధానం ప్రధానంగా పెట్టుబడుల వృద్ధిపైనే దృష్టి సారించాలి గనుక కార్మికుల సంక్షేమం విషయంలో ఆ విధానం చేయగలిగిందేమీ ఉండదని, పెరిగిన సంపదలో కార్మికుల వాటా పెరగాలంటే ఆ కార్మికులు తమ జీవన శైలిని తగువిధంగా మార్చుకోవలసి వుంటుందని వారు తెలిపారు.
పెట్టుబడిదారీ దశ తొలి కాలపు ఆర్థికవేత్తలుగా ఆడం స్మిత్‌, రికార్డోల వైఖరిని మనం అర్ధం చేసుకోవచ్చు. కాని తదనంతర కాలపు ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తల విషయంలో మాత్రం కాదు. ఎందుకంటే కార్మికుల ఆదాయాలు పెరిగితే వారు మరింతమంది సంతానాన్ని కంటారన్న మాల్థూస్‌ జనాభా సిద్ధాంతం శుద్ధ తప్పు అని ఎప్పుడో తేలి పోయింది (అత్యంత పేద దేశాల్లో జనాభా ఎక్కువగా ఉంది. సంపన్న దేశాల జనాభా తక్కువగా ఉంది. మన దేశంలో కూడా సాపేక్షంగా ఆర్థికంగా ముందున్న దక్షిణాది జనాభా వృద్ధి కన్నా ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉంది). మాల్థూస్‌ సిద్ధాంతం మానవ జాతికే అవమానకరమైన సిద్ధాంతం అని మార్క్స్‌ విమర్శించాడు. ఐనప్పటికీ, ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు (అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ సమర్ధకులు) నేటికాలంలో కూడా ఒకానొక దేశం పురోగతికి సూచికగా ఆ దేశపు జీడీపీనే లెక్కలోకి తీసుకుంటారు. ఆ జీడీపీ వృద్ధి సాధించాలంటే పెట్టుబడిదారులు వృద్ధి సాధించడమే కీలకం కనుక ఆ పెట్టుబడిదారులను సంతృప్తిపరుస్తూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఆ పెట్టుబడిదారులు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా వారిని ఆరాధిస్తారు.
కార్మికుల అలవాట్లు, జీవనశైలి మారితే తప్ప వారి జీవితాలు మెరుగుపడవు అన్న స్మిత్‌ రికార్డో ఆనాడు భావించి వుండొచ్చు (వారి అభిప్రాయం సరైనది కాదు. అది వేరే సంగతి), కాని నేటి కాలపు ఆర్థికవేత్తలు కూడా పెట్టుబడిదారీ వర్గ ఆరాధకులుగా ఉండడం అనేది కేవలం ఒక సైద్ధాంతిక పక్షపాత ధోరణి వల్లనే.
ఈ విధమైన పక్షపాతం తాజాగా నిటి ఆయోగ్‌ సి.ఇ.ఓ చేసిన ప్రకటనలో వ్యక్తం అయింది. నేటికి మన దేశం ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని అతడు ప్రకటించాడు. జిడిపి సైజును బట్టి చూస్తే మనం తాజాగా జపాన్‌ను దాటి నాలుగు ట్రిలియన్ల డాలర్లకు చేరుకున్నాం అని తెలిపాడు. నిటి ఆయోగ్‌ సి.ఇ.ఓ ఏదో యథాలాపంగా చెప్పిన మాటలు కావివి. దీన్ని ఒక గొప్ప విజయంగా ప్రత్యేకంగా నొక్కి చెప్పాలని అతడు అను కున్నాడు. ఈ అభివృద్ధిని భారతదేశంలోని బడా కార్పొరేట్ల మూక యావత్తూ శ్లాఘించింది. ఆ సి.ఇ.ఓ మన జీడీపీ జపాన్‌ను దాటిపోయిందని చెప్పాడే కాని మన దేశ జనాభా జపాన్‌ జనాభా కన్నా పదిరెట్లకు పైనే ఉంటుందన్న వాస్తవాన్ని మాత్రం చెప్పలేదు. మోడీ ఆ మధ్య భారతదేశ జీడీపీ త్వరలోనే ఐదు ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరు తుందని ప్రకటించాడు. దానికి అనుగుణంగానే ఇతగాడు ఈ కాకి కూతలు కూస్తున్నాడు.
సంపన్న పెట్టుబడిదారీ దేశాల జీడీపీలతో పోల్చి మన జీడీపీని మాత్రమే చూసినప్పుడు దానికి ఏ ప్రయో జనమూ ఉండదు. జీడీపీ వృద్ధిపై మాత్రమే దృష్టిని కేంద్రీకరించడం అనేదే ఒక తప్పుడు దృక్పథం. మళ్లీ అది మనల్ని కాలం చెల్లిన మాల్థూస్‌ సిద్ధాంతం వైపు తీసుకు పోతుంది. అంతేకాదు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ దృక్పధానికి స్థానం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కీలకమైనది ప్రజల జీవన పరిస్థితులు. వారి జీవన స్థితిగతుల్లో ఎంత మెరుగుదల వచ్చిందో కొలిచేదే నిజమైన వృద్ధి.
ఈ ‘జీడీపీ ఆరాధన’ అనేది మన జాతీయోద్యమ కాలపు దృక్పథానికి పూర్తిగా భిన్నం. జపాన్‌ను మించి మన జీడీపీ ఉందని సంబరాలు చేసుకోవడం అంటే జపాన్‌ను, ఇండియాను వాటి వాటి ప్రజానీకంతో సంబంధం లేని, ప్రజల కన్నా ఉన్నతంగా ఉండే ”జాతీయ” భావనను భుజాన మోయడమే. ఈ ”గొప్ప” విజయానికి, ప్రజల జీవన పరిస్థితులకి ఏమాత్రమూ సంబంధం లేదు. కాని ఆనాడు జాతీయోద్యమం దేశ విముక్తి అంటే బ్రిటిష్‌ వలస పాలన నుండి దేశ ప్రజల విముక్తి అని భావించింది. కేవలం కొద్దిమంది పెట్టుబడిదారుల విముక్తి అని స్వాతంత్య్ర పోరాట యోధులు భావించలేదు.
స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా, ప్రజల స్థితిగతులు మాత్రం అప్పటిలాగానే ఉన్నాయి. 127 ప్రపంచ దేశాలకుగాను భారతదేశం ఆకలి సూచికలో 105వ స్థానంలో ఉంది. ఈ విషయంలో సిగ్గు పడవల సింది పోయి మోడీ ప్రభుత్వం జీడీపీ వృద్ధి గురించి కాకి కూతలు కూస్తోంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -