Thursday, June 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబెస్ట్‌ అవైలబుల్‌ విద్యార్థుల గెంటివేత

బెస్ట్‌ అవైలబుల్‌ విద్యార్థుల గెంటివేత

- Advertisement -

– పెండింగ్‌లో రూ.154 కోట్ల బకాయిలు
– ప్రారంభమైన 2025-26 అడ్మిషన్ల ప్రక్రియ
– విద్యార్థుల్ని చేర్చుకోలేమంటున్న ప్రయివేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలు
– బిల్లులిస్తేనే అడ్మిషన్లు అంటున్న వైనం
– రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల మంది విద్యార్థులు
– ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్‌ విధ్య మిథ్యేనా
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ స్కీమ్‌ (బీఎఎస్‌ఎస్‌)లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం నుంచి మూడేండ్లుగా బిల్లులు అందట్లేదు. ఫలితంగా ప్రయివేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలు భారాలు భరించలేమంటూ విద్యార్థుల్ని గెంటేస్తున్నారు. రెసిడెన్సియల్‌, డే స్కాలర్స్‌ విద్యార్థుల కోసం ఖర్చు చేసిన డబ్బులు తిరిగి రాకపోవడంతో తామంతా అప్పులు చేయాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. పాత విద్యార్థుల బకాయి బిల్లులు రాకపోవడంతో ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా అడ్మిషన్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 1, 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం లాటరీ పద్దతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించకపోతే ఎవర్నీ కొత్తగా స్కూల్స్‌లో చేర్చులేమని యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య అందిస్తామని చెప్పిన ప్రభుత్వాలు నిధుల కేటాయింపుల్లో మాత్రం నిర్లక్షం చేస్తున్నాయంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించడంతో పాటు సీట్ల సంఖ్యను పెంచాలని కేవీపీఎస్‌ డిమాండ్‌ చేస్తోంది.
సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలతో పాటు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేకంగా కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ స్కీమ్‌ను అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా 1వ, 5వ తరగతిలో ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులను ఆయా పట్టణాల్లోని ప్రయివేట్‌ పాఠశాలలకు అలాట్‌ చేస్తారు. 1 నుంచి 5వ తరగతి వరకు డే స్కాలర్స్‌గా 5 నుంచి 10వ తరగతి వరకు రెసిడెన్షియల్‌ సదుపాయంతో విద్యార్థుల్ని చేర్చుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 250 పాఠశాలల్ని బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ కింద ఎంపిక చేశారు. వీటిల్లో 25 వేల మంది విద్యార్థులు 1 నుంచి 10వ తరగతిలో విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి ఏటా ఒక్కో జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్స్‌ ద్వారా 128, 125 మంది చొప్పున 1వ, 5వ తరగతుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఇంగ్లీష్‌ మీడియంలో ప్రమాణాలు కలిగిన ప్రయివేట్‌ స్కూల్స్‌లో ఉచితమైన విద్య, హాస్టల్‌ వసతి లభిస్తుండటంతో ప్రతి ఏటా అడ్మిషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేస్తున్నారు. బీఎఎస్‌ఎస్‌ కింద చదివిన విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ ప్రయోజకులవుతున్నారు. అందుకే ఈ స్కీమ్‌లో సీట్లు వస్తే తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు.
పెండింగ్‌లో రూ.154 కోట్ల బకాయిలు
రాష్ట్రంలోని బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో చదవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం నుంచి రూ.154 కోట్ల నిధులు రావాల్సి ఉంది. ఎన్నికల ముందు గత ప్రభుత్వం కొంత పెండింగ్‌ పెట్టగా ఈ ప్రభుత్వం వచ్చాక కూడా బిల్లులు చెల్లించలేదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందిస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు అందుకు ఇవ్వాల్సిన నిధుల్ని మాత్రం విడుదల చేయట్లేదు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ కింద ఎంపికైన ఒక్కో విద్యార్థికి రెసిడెన్షియల్‌ అయితే రూ.42000, డేస్కాలర్‌ అయితే రూ.28000 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ లెక్కన రాష్ట్రంలో రూ.154 కోట్ల బిల్లులు రావాలి. రెండు మూడు జిల్లాలకు మాత్రం యాజమాన్యాల ఒత్తిడితో బిల్లులు చెల్లించి ఇతర జిల్లాలను విస్మరించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో రూ.8.50 కోట్ల మేరకు బిల్లులు రావాలి. సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ వెల్ఫేర్‌ పరిధిలో 12 పాఠశాలల్లో 850 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రూ.7.5 కోట్ల బకాయిలు ఉన్నాయి. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మరో రూ.1 కోటి వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మూడేండ్లుగా బిల్లులు చేసి పంపుతున్నా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాని పరిస్థితి ఉంది.
కొత్తగా అడ్మిషన్ల ప్రక్రియ..
నిరాకరిస్తున్న యాజమాన్యాలు

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ కింద విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించే ప్రక్రియను ప్రారంభించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఈ నెల 20న ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా ఒకటవ, ఐదో తరగతిలో అడ్మిషన్ల కోసం లాటరీ తీసి తరగతుల వారీగా విద్యార్థులను ఎంపిక చేశారు. నిర్దేశించిన పాఠశాలకు విద్యార్థులను అలాట్‌మెంట్‌ చేశారు. ఎంపికైన విద్యార్థులు, తల్లిదండ్రులు సదరు పాఠశాలకు వెళ్లి అడ్మిషన్ల కోరగా చాలా పాఠశాలల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో పేరున్న ఒక పాఠశాల యాజమాన్యం కొత్తగా విద్యార్థులను చేర్చుకోవడానికి నిరాకరించింది. మరో కార్పొరేట్‌ పాఠశాల యాజమాన్యం ఈ ఏడాది బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ వద్దని చెప్పడంతో ప్రత్యామ్నాయంగా మరో స్కూల్‌ను ఎంపిక చేశారు. ఎస్టీ విద్యార్థుల్ని అలాట్‌ చేసిన మరో పాఠశాల యాజమాన్యం ఏకంగా పాత విద్యార్థులను స్కూల్స్‌ను నుంచి బయటికి పంపింది. విద్యార్థులకు రావాల్సిన ఫీజుల్ని తల్లిదండ్రులు ముందే చెల్లించాలని, బిల్లులు వచ్చాక వాళ్లే తీసుకోండంటూ తేల్చి చెప్పడంతో విద్యార్థులు వీధిన పడ్డారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌, యూనిఫామ్స్‌, ఇతర మెటీరియల్‌ ఏవీ కూడా బీఎఎస్‌ఎస్‌ విద్యార్థులకు ఇవ్వడంలేదు. బకాయిలు రావడట్లేదంటూ కొందరు విద్యార్థుల్ని బయటే నిల్చోబెడుతున్న పరిస్థితి ఉంది.
అప్పులు భరించలేమంటున్న యాజమాన్యాలు
బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ కింద విద్యార్థులకు వసతి కల్పించి విద్యనందించడం కోసం అప్పులు చేస్తున్నామంటూ పలువురు స్కూల్‌ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేండ్లుగా విద్యార్థులకు రావాల్సిన బిల్లులు రావట్లేదంటున్నారు. 25 మంది విద్యార్థులున్న పాఠశాలలో వారి కోసం ఏటా రూ.10 లక్షల వరకు బిల్లు రావాలి. అలా మూడేండ్లల్లో రూ.30 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయంటూ సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రముఖ స్కూల్‌ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి విద్యను అందిస్తున్నప్పటికీ బిల్లులు సకాలంలో ఇవ్వకపోతే స్కూల్స్‌ నడపడం కన్నా మూసేయడం మంచిదని ఆయన నిటూర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రయివేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాల అసోషియేషన్‌ బిల్లుల కోసం ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు.
విద్యార్థుల్ని ఎంపిక చేసి అలాట్‌ చేశాం: అఖిలేష్‌రెడ్డి, డీడీ సోషల్‌ వెల్ఫేర్‌
ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల కింద విద్యార్థుల్ని ఎంపిక చేశాం. ఆయా పాఠశాలలకు విద్యార్థులను అలాట్‌మెంట్‌ చేసి జాబితాలు పంపాం. బిల్లులు చెల్లించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి.వారితో మాట్లాడి విద్యార్థుల్ని చేర్చుకునేలా చూస్తాం. విద్యార్థులందర్నీ చేర్చుకుంటారు.
సీఎం చొరవతీసుకుని బిల్లులు చెల్లించాలి:అశోక్‌, కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, సంగారెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ విద్యార్థులకు రావాల్సిన బిల్లులను వెంటనే చెల్లించాలి. బిల్లులు రాకపోవడంతో ప్రయివేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నాయి. ఇప్పటికే పలు పాఠశాలల్లో విద్యార్థులను బయటికి పంపుతున్నారు. దీంతో విద్యార్థుల చదువులు మద్యంతరంగా ఆగిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, కలెక్టర్‌, మంత్రుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. బడ్జెట్‌లోనే నిధులు కేటాయించి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బిల్లులు చెల్లించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -