నవతెలంగాణ – హైదరాబాద్: నిధుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ శాఖకు పూర్తి మద్దతు ఇస్తున్నారని, కాబట్టి నిధుల గురించి ఆలోచించకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఎర్రమంజిల్ కార్యాలయంలో మంగళవారం ఆయన ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి, పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో రహదారులు, భవనాల (ఆర్అండ్బీ) శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. “ప్రమోషన్లు, పోస్టింగుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి అన్నీ పూర్తి చేశాం. ఇప్పుడు మీరంతా ఫలితాలు చూపించాల్సిన సమయం వచ్చింది” అని అధికారులకు స్పష్టం చేశారు.
శాఖ పరిధిలోని అన్ని రకాల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, ఏమాత్రం జాప్యం తగదని ఆయన తేల్చిచెప్పారు. చీఫ్ ఇంజినీర్లు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పనుల నాణ్యతను స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. ఇకపై జరిగే ప్రతి సమీక్ష సమావేశానికి పనుల్లో ఎంత పురోగతి సాధించారో స్పష్టమైన నివేదికతో హాజరుకావాలని ఆదేశించారు.
రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, ఇతర ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆసుపత్రులు, నాణ్యమైన రహదారులను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. రెండు రోజుల్లో హ్యామ్ (హెచ్ఏఎం) రోడ్ల ప్యాకేజీలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. రహదారులపై ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్లను, వర్టికల్ కర్వ్లను ముందుగానే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజినీర్లకు సూచించారు. పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.