Tuesday, June 10, 2025
E-PAPER
Homeజాతీయంమోడీ పాలనకు 11 ఏండ్లు

మోడీ పాలనకు 11 ఏండ్లు

- Advertisement -

– మెజార్టీ లేక సంకీర్ణ భాగస్వాములే దిక్కు
– ప్రతిపక్షాల ఒత్తిళ్లతో పలు నిర్ణయాల్లో యూటర్న్‌

గతేడాది జూన్‌ 9న ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. అంటే ఆయన 11 ఏండ్లుగా దేశాన్ని పాలిస్తున్నా… ఏదో వెలితి మాత్రం బీజేపీని, మోడీని వెంటాడుతూనే ఉంది. గతంలో ఎన్నడూలేని విధంగా తొలిసారిగా లోక్‌సభలో మెజారిటీని సాధించలేక సంకీర్ణ భాగస్వాములపై ఆధారపడి నెట్టుకురావాల్సి వస్తోంది. ఎన్డీఏ పక్షాలకు నజరానాలో..మరొకటో ఏదో ఒకటి ఇచ్చి బుజ్జగించక తప్పడం లేదు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ‘చార్‌ సౌ పార్‌’ అనే నినాదాన్ని అందించి 400 మార్కును దాటుతామని మోడీ, బీజేపీ పదే పదే దీమా వ్యక్తం చేసినప్పటికీ సాధారణ మెజారిటీకి సైతం దూరంగా 240 స్థానాలకే పరిమితమైంది. దీంతో తొలిసారిగా మిత్రపక్షాల మీద ఆధారపడకతప్పటం లేదు.
న్యూఢిల్లీ : గత సంవత్సర కాలంగా మోడీ తీసుకున్న నిర్ణయాలు…జనగణనతో పాటే కులగణన చేస్తామని ప్రకటించడం, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ప్రపంచ దేశాలకు ప్రతినిధి బృందాలను పంపడానికి ప్రతిపక్షాల సాయం కోరడం, కేంద్ర ప్రభుత్వంలో ఖాళీల భర్తీకి సంబంధించి లాటరల్‌ ఎంట్రీ నియామకాలలో రిజర్వేషన్లు కోరడం, వాజ్‌పేయి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 21 సంవత్సరాల నాటి పెన్షన్‌ సంస్కరణల నిర్ణయాన్ని రద్దు చేయడం ద్వారా ఏకీకృత పెన్షన్‌ పథకాన్ని తీసుకురావడం, వక్ఫ్‌ సవరణ వంటి కీలక బిల్లులను పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు పంపడం…వీటిని చూస్తుంటే మిత్రపక్షాలు, ప్రతిపక్షాల ఒత్తిడి కింద మోడీ ఎలా పనిచేయాల్సి వచ్చిందో అర్థమవుతుంది. మోడీ తన మూడో పదవీకాలంలో ఇప్పటికి సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వ 11 సంవత్సరాల పాలనపై దృష్టి సారించాలని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో గత సంవత్సర కాలంలో తీసుకున్న ఐదు కీలక నిర్ణయాలను సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జనగణనతోనే కులగణన
జనగణనతో పాటు కులగణన కూడా చేపడతామని ఏప్రిల్‌ 30న ప్రధాని ప్రకటించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ఇది ప్రచారాంశంగా మారింది. కులగణన జరపాలని నిర్ణయించడం ద్వారా సమాజం, దేశం యొక్క విలువలు, ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్న విషయం స్పష్టమైందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌.. కులగణన రాజకీయ అంశంగా మార్చిందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కులగణనను వ్యతిరేకించాయని గుర్తు చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో కులగణనను బీజేపీ తప్పుపట్టింది. దీనిని సమాజాన్ని విభజించే చర్యగా అభివర్ణించింది. కానీ ఇప్పుడు మాట మార్చి వచ్చే ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి జనగణనతో పాటే కులగణనను రెండు దశలలో నిర్వహిస్తామని ప్రకటించింది.
లేటరల్‌ ఎంట్రీ నియామకాలపై…
ఎన్డీఏలోని కొన్ని భాగస్వామ్య పక్షాల డిమాండ్‌ మేరకు మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలోని 45 కీలక పోస్టుల భర్తీ కోసం లేటరల్‌ నియామకాలకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని యూపీఎస్‌సీని కోరింది. ఈ చర్య సామాజిక న్యాయం, సాధికారత సాధనలో గణనీయమైన పురోగతి అవుతుందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ చెప్పుకొచ్చారు. లేటరల్‌ ఎంట్రీ ప్రక్రియ రిజర్వేషన్లకు అనుగుణంగా ఉండాలని మోడీ భావిస్తున్నారని కూడా తెలిపారు. అంతకుముందు యూపీఎస్‌ఈ జారీ చేసిన లేటరల్‌ ఎంట్రీ నియామకాల ప్రకటనను ప్రతిపక్షాలు తప్పుపట్టడమే కాకుండా రిజర్వేషన్ల అమలును అడ్డుకునేందుకు జరిపిన కుట్రగా అభివర్ణించాయి. యూపీఎస్‌సీ ప్రకటనను ప్రతిపక్షాలతో పాటు ఎన్డీఏ భాగస్వామి అయిన కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ పోస్టుల రిజర్వేషన్లలో ‘కానీ, అయితే’ వంటి పదాలు ఉండవని చెప్పారు.
మధ్యేమార్గంగా యూపీఎస్‌ అమలు
కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టులో ఏకీకృత పెన్షన్‌ పథకాన్ని (యూపీఎస్‌) ఆమోదించింది. వాజ్‌పేయి ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పెన్షన్‌ పథకాన్ని (ఎన్‌పీఎస్‌) అటకెక్కించి యూపీఎస్‌కు పచ్చజెండా ఊపింది. మళ్లీ పాత పెన్షన్‌ పథకాన్ని (ఓపీఎస్‌) అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం మధ్యేమార్గంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సహా అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తిరిగి ఓపీఎస్‌ను అమలు చేశాయి. ఎన్‌పీఎస్‌పై సమీక్ష జరిపేందుకు 2023 ఏప్రిల్‌లో మోడీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ యూపీఎస్‌ను సిఫారసు చేసిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ శాసనసభ ఎన్నికలకు ముందు యూపీఎస్‌పై కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ప్రతిపక్షాల సహకారం కోసం…
ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ప్రభుత్వం తన చర్యలకు ప్రపంచ దేశాల మద్దతు పొందేందుకు దౌత్య యత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ప్రతిపక్షాల సహకారాన్ని కోరింది. మోడీ 1.0, మోడీ 2.0 పాలనలో అవలంబించిన వైఖరులకు ఇది పూర్తి భిన్నంగా ఉంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, పాక్‌తో సైనిక వివాదం నేపథ్యంలో విదేశీ వ్యవహారాల విషయంలో ప్రభుత్వం ప్రతిపక్షాల మద్దతు కోరింది. గడచిన పది సంవత్సరాల పాలనలో మోడీ భారత విదేశాంగ విధానాన్ని స్వయంగానే రూపొందించుకున్నారు. 2019లో పుల్వామాలో జరిగిన దాడి, బాలాకోట్‌ వైమానిక దాడుల సమయంలో మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలను సంప్రదించిన దాఖలాలు లేవు. కానీ ఈసారి ప్రతిపక్ష ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకు పంపింది. అఖిలపక్ష ప్రతినిధులు, దౌత్యవేత్తలతో కూడిన ఏడు బృందాలు 33 దేశాలలో పర్యటించాయి. ఈ బృందాలలో మూడింటికి ప్రతిపక్ష ఎంపీలు నేతృత్వం వహించగా రెండింటికి బీజేపీ ఎంపీలు, మిగిలిన రెండింటికి సంకీర్ణ భాగస్వాములు నాయకత్వం వహించారు. గతంలో ప్రభుత్వాలు ఇలాగే ప్రతినిధి బృందాలను విదేశాలకు పంపాయి. మోడీ హయాంలో తొలిసారిగా ఆ విధంగా పంపడం జరిగింది.
అనేక బిల్లులపై పునరాలోచన

మోడీ ప్రభుత్వం తొలి రెండు పదవీకాలాలలో చాలా దూకుడుగా వ్యవహరించింది. 2020లో వివాదాస్పద వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. ప్రతిపక్ష ఎంపీలను రికార్డు సంఖ్యలో పార్లమెంట్‌ నుండి బహిష్కరించింది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత సీన్‌ రివర్స్‌ అయింది. ప్రతిపక్షాలు పుంజుకోవడంతో ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన తొలి బిల్లు వక్ఫ్‌ సవరణకు సంబంధించింది. దీనిని గత ఆగస్టులో ప్రవేశపెట్టారు.
దీనిపై ప్రతిపక్షాలు మూకుమ్మడిగా విమర్శలు సంధించాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకున్న ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని మండిపడ్డాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపింది. ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించింది. కానీ ప్రతిపక్షాల నుండి గట్టి ప్రతిఘటన ఎదురైంది. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు రాగా వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. లోక్‌సభలో బిల్లును 288 మంది సమర్ధించగా 232 మంది వ్యతిరేకించారు. ప్రతిపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ప్రసార బిల్లును కూడా పక్కన పెట్టింది. ఇక రియల్‌ ఎస్టేట్‌ అమ్మకాలలో పన్ను లెక్కింపు విధానంలో మార్పులకు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాలపై విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను రేట్లలో దేనిలో ఒక దానిని ఎంచుకునేందుకు అనుమతించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -