– పట్టించుకోని ఈసీ
– బీజేపీ సహకారంతోనే ఎంఐఎం ఆటలు
– పవర్పాయింట్ ప్రజెంటేషన్లో ఫిరోజ్ఖాన్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ జిల్లా నాంపల్లి నియోజకవర్గంలో మొత్తం 3,10,958 ఓట్లు ఉంటే, అందులో 1,13,310 బోగస్ ఓట్లే ఉన్నాయని కాంగ్రెస్ నేత, ఇన్చార్జి ఫిరోజ్ఖాన్ చెప్పారు. ఇందుకు సంబంధించి బీజేపీ సహకారంతోనే ఎంఐఎం ఆటలాడుతున్నదని విమర్శించారు. బోగస్ ఓట్లను తొలగించాలంటూ ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నేరపూరిత చర్య అని చెప్పారు. బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో బోగస్ ఓట్లపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాంపల్లిలో డూప్లికేట్ అడ్రస్లతో కొత్త ఓట్లను సృష్టించారని తెలిపారు. దొంగ ఓట్లు వేస్తున్న ముగ్గుర్ని కూడా పట్టుకున్నామని వివరించారు. వారు ఎంఐఎం అధ్యక్షులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అనుచరులని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఓటర్ల జాబితాను ప్యూరిఫికేషన్ చేసేందుకు వంద మంది అధికారులను నియమించినప్పటికీ ఉపయోగం లేకుండాపోయిందని విమర్శించారు. ఐదేండ్లుగా బోగస్ ఓట్లను తొలగించాలంటూ కొట్లాడితే, పది శాతం మాత్రమే తొలగించిందని తెలిపారు. అందులో ఎక్కువగా చనిపోయిన వారి పేర్లే ఉన్నాయన్నారు. దేశంలో బీజేపీ బోగస్ ఓట్లను సృష్టిస్తుండగా, హైదరాబాద్లో మాత్రం ఆ పని ఎంఐఎం చేస్తున్నదని ఆరోపించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశాన్ని ఎత్తుకోవడం సంతోషకరమన్నారు. దొంగ ఓట్లను నియంత్రించకపోతే దేశానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. నాంపల్లిలో బోగస్ ఓట్లతోపాటు ప్రత్యర్థులు రౌడీయిజం చేయడంతో తాను రెండువేల ఓట్లతో ఓడిపోయినట్టు తెలిపారు. వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఎన్నికల సంఘం డిజిటల్ ఓటరు జాబితాను బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. ‘ఇది పొలిటికల్ ఫైట్ కాదు.సేవ్ డెమోక్రసీ కోసం ఫైట్’ అన్నారు. నాంపల్లిలో గెలిచినట్టు జూబ్లీహిల్స్, సికింద్రాబాద్లో పోటీ చేసి ఎంఐఎం గెలవాలంటూ ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. ‘నాంపల్లి నియోజకవర్గంలో మొత్తం 3,10,953 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,61,068, మహిళలు 1,49,876, తొమ్మిది మంది థర్డ్ జెండర్ ఓట్లు ఉన్నాయి. అందులో చనిపోయిన ఓటర్లు 10,471 మంది, షిప్టు అయిన ఓటర్లు 45,567 మంది, ఇంటి అడ్రస్ లేని ఓటర్లు 34,867 మంది అని తెలిపారు. ఇతర నియోజకవర్గాలకు చెందిన ఓటర్లుగా ఉండి ఇక్కడ కూడా ఓటు నమోదు చేసుకున్న వారు 16,468 మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు ఉండి, నాంపల్లిలో ఓటర్గా ఉన్న వారు 5,937 మంది ఉన్నారు. మొత్తంగా 1,13,310 బోగస్ ఓట్లు ఉన్నట్టు తేలిందని ఆయన పేర్కొన్నారు.
నాంపల్లిలో 1,13,310 బోగస్ ఓట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES