– యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా సిలబస్ రూపకల్పన
– వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు
– జూన్ 30 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు : వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో 2025-26 విద్యాసంవత్సరంలో డిగ్రీ సిలబస్లో మార్పులు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో 142 క్రెడిట్లు ఉంటాయని ఖరారు చేసింది. ఇప్పటి వరకు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)లో భాగంగా డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 150 క్రెడిట్లు ఉన్నాయి. గతనెల 29న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దాని ప్రకారం మూడేండ్ల డిగ్రీ కోర్సుకైతే ఏడాదికి కనీసం 120 క్రెడిట్లు, నాలుగేండ్ల కోర్సుకైతే ఏడాదికి 160 క్రెడిట్లు ఉండాలని ఆదేశించింది.
యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా క్రెడిట్లలో ఉన్నత విద్యామండలి మార్పు చేసింది. నేషనల్ కర్రికులమ్ ఫ్రేమ్వర్క్ (ఎన్సీఎఫ్)లో భాగంగా 142 క్రెడిట్లు ఉండాలని నిర్ణయించింది. గురువారం హైదరాబాద్లో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీ) సమావేశాన్ని ఉన్నత విద్యామండలి నిర్వహించింది. గతంలో విశ్వవిద్యాలయాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) చైర్మెన్లు, రిజిస్ట్రార్లతో సంప్రదింపులు చేసి 124 క్రెడిట్లు ఉండాలని తాత్కాలికంగా నిర్ణయించింది. వీసీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని డిగ్రీ ప్రథమ సంవత్సరంలో 142 క్రెడిట్లు ఉండాలని ఖరారు చేసింది. గతేడాది ఉన్న 150 క్రెడిట్లలో ఎనిమిది క్రెడిట్లు భాషా సబ్జెక్టుల్లో తగ్గించారు.
కామన్ అకడమిక్ క్యాలెండర్
అమలు చేస్తాం : బాలకిష్టారెడ్డి
అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి తనను కలిసిన విలేకర్లతో మాట్లాడుతూ ప్రధాన సబ్జెక్టులు, మైనర్ సబ్జెక్టులతోపాటు డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్ (డీఎస్ఈ), ఎబిలిటి ఎన్హేన్స్మెంట్ కోర్సు (ఏఈసీ), అప్రెంటీస్షిప్తోపాటు విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్, పరిశోధనకు సంబంధించిన అంశాలుండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో మార్పు చేసిన సిలబస్ను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తెస్తామని చెప్పారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో కామన్ అకడమిక్ క్యాలెండర్ను అమలు చేస్తామన్నారు. కామన్ సిలబస్ ఉంటుందని అన్నారు. అన్ని వర్సిటీల్లో పరీక్షలనూ ఉమ్మడిగానే నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరంలో జూన్ 30 నుంచి డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ తరగతులను ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్లు ఇటికాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఓయూ రిజిస్ట్రార్ నరేష్రెడ్డి, వీసీలు కె ప్రతాప్రెడ్డి (కేయూ), ఖాజా అల్తాఫ్ హుస్సేన్ (ఎంజీయూ), టి యాదగిరిరావు (టీయూ), జిఎన్ శ్రీనివాస్ (పీయూ), ఉమేష్ కుమార్ (ఎస్యూ), సూర్య ధనుంజరు (మహిళా వర్సిటీ) తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీలో 142 క్రెడిట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES