ఛత్తీస్గఢ్ – ఒడిశా సరిహద్దులో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు సరెండర్
రాయ్ పూర్ : స్పెషల్ జోన్ కమిటీ స్థాయి సభ్యుడు వికాస్ సహా 15మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో తొమ్మిదిమంది మహిళలు కూడా ఉన్నారు. మహాసముంద్ జిల్లాలో భద్రతా సిబ్బంది ఎదుట వారంతా లొంగిపోయారని ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ ఆదివారం తెలిపారు. రాయ్ పూర్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లొంగిపోయిన వారంతా బలంగిర్- బర్గఢ్- మహాసముంద్ విభాగానికి చెందిన వారని, ఈ విభాగం ఛత్తీస్గఢ్ – ఒడిశా సరిహద్దుల్లో కీలకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు వికాస్ మావోయిస్టు సంస్థ వెస్ట్ సబ్-జోనల్ విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వారి నుంచి ఎకె-47 రైఫిల్స్, రెండు సెల్ఫ్ లోడిండ్ రైఫిల్స్ (ఎస్ఎల్ఆర్ఎస్), రెండు ఐఎన్ఎస్ఎస్ రైఫిల్స్, మూడు 303 రైఫిల్స్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గత రెండేళ్లలో 532మంది మావోయిస్టులు మరణించగా, 2,700మందికి పైగా లొంగిపోయారు. సుమారు రెండు వేలమందిని అరెస్ట్ చేశారు.



