నవతెలంగాణ-హైదరాబాద్: టీటీపీ (తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్)కి చెందిన ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ భద్రతా దళాలు హతమార్చాయి. వాయువ్య ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్లో పాక్ భద్రతా దళాలు, పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్లో నిషేధిత టిటిపి గ్రూపుతో సంబంధం ఉన్న 17 మంది ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్సి), పోలీసులు సంయుక్తంగా నిఘా ఆపరేషన్ను నిర్వహించారని జిల్లా పోలీసు అధికారి కరక్ షాబాజ్ ఎలాహి తెలిపారు.
టీటీపీ, ముల్లా నజీర్ గ్రూపుతో సంబంధం ఉన్న ఉగ్రవాదుల ఉనికి గురించి విశ్వసనీయ సమాచారం అందిన తర్వాత కరాక్ జిల్లాలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారి తెలిపారు. భద్రతా బలగాలు సమీపించగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు చేశాయి. ఈ కాల్పుల్లో 17 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాదుల నుండి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘర్షణల్లో సెక్యురిటీ సిబ్బందిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉగ్రవాదులు తప్పించుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆశ్రయం పొందారని అనుమానం రావడంతో.. కరాక్ జిల్లా యంత్రాంగం దర్శఖేల్ సమీప గ్రామాల్లో కర్ఫ్యూ విధించింది.