– ప్రభుత్వ స్కూళ్లలో 38.89 శాతం మంది
– ప్రయివేటు పాఠశాలల్లో 61.11 శాతం విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని ప్రభుత్వ పాఠశాలలు 1,980 ఉన్నాయి. రాష్ట్రంలో 18,259 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలుంటే 1,900 స్కూళ్లు, 3,143 ప్రాథమికోన్నత పాఠశాలలుంటే 40 స్కూళ్లు, 4,704 ఉన్నత పాఠశాలలుంటే 40 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరంలో 30,137 ప్రభుత్వ పాఠశాలల్లో 23,71,772 (38.89 శాతం) మంది విద్యార్థులు చదివారు. 11,757 ప్రయివేటు స్కూళ్లలో 37,26,220 (61.11 శాతం) మంది విద్యనభ్యసించారు. హైదరాబాద్లో 8,45,540 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో ప్రయివేటు పాఠశాలల్లో 7,26,529 (85.92 శాతం) మంది ఉన్నారు. ప్రభుత్వ బడుల్లో కేవలం 1,19,011 (14.08 శాతం) చదువుతున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 7,30,873 మంది చదువుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో 93,583 (12.80 శాతం) మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రయివేటు బడుల్లో 6,37,290 (87.20 శాతం) మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 7,44,923 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో ప్రభుత్వ స్కూళ్లలో 1,60,232 (21.51 శాతం) మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రయివేటు పాఠశాలల్లో 5,84,691 (78.49 శాతం) మంది చదువుతున్నారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి ఈ మూడు జిల్లాల్లో 23,21,336 మంది ఉంటే సర్కారు బడుల్లో 3,72,826 (16.06 శాతం) మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రయివేటు పాఠశాలల్లో 19,48,510 (83.94 శాతం) మంది ఉన్నారు.
