మేడారంలో మెరుగైన వైద్య సేవలందిస్తాం
3,199 మంది సిబ్బందితో వైద్య సేవలు
అందుబాటులో 35 అంబులెన్సులు
జాతరకు వెళ్లే రూట్లలో మరో 42 క్యాంపులు : ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు వైద్యపరంగా ఇబ్బందులు తలెత్తకుండా సేవలందించేందుకు మూడు ఆస్పత్రులు, 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామనీ, 3,199 మంది సిబ్బందితో వైద్యసేవలందిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. 35 అంబులెన్స్లను అందుబాటులో ఉంచామన్నారు. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా తక్షణం స్పందించి వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు శనివారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతర ఏర్పాట్లపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రూపొందించిన ప్రణాళికను పరిశీలించారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు ముందస్తుగానే జాతరకు వెళ్తున్నారనీ, ఈ నేపథ్యంలో ఇప్పటికే గద్దెల వద్ద, జంపన్న వాగు సమీపంలో, ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద 3 వైద్య శిబిరాలను ప్రారంభించామని అధికారులు మంత్రికి వివరించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నందున జాతర పరిసరాలలో మరిన్ని మెడికల్ క్యాంపులను ముందస్తుగానే ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
మేడారం చేరుకునే అన్ని రూట్లలోనూ మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకలతో కూడిన ప్రధాన హాస్పిటల్, దానికి అదనంగా జంపన్న వాగు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద ఆరు పడకల సామర్థ్యంతో రెండు మినీ హాస్పిటళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు వచ్చే 8 ప్రధాన రూట్లలో, ఎక్కడా వైద్య సేవలకు లోటు రాకూడదని మంత్రి సూచించారు. ఇందుకోసం 42 ఎన్-రూట్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశామనీ, హనుమకొండ – మేడారం రూట్లో అత్యధికంగా 9 క్యాంపులు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే భక్తుల కోసం 6 క్యాంపులు, భద్రాచలం రూట్లో 5 క్యాంపులు ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. చిన్నపిల్లల మందుల దగ్గరి నుంచి పాముకాటు విరుగుడు ఇంజెక్షన్ల వరకు 248 రకాల మందులు, సర్జికల్ సామాగ్రిని ముందస్తుగానే సిద్ధం చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే జనవరి 25వ తేదీ నుంచి అన్ని వైద్య శిబిరాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. తక్షణమే మేడారం వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ను మంత్రి ఆదేశించారు.
3,199 మందితో వైద్య సైన్యం
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి మొత్తం 3,199 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. అందులో 72 మంది స్పెషలిస్టులు, 42 మంది లేడీ డాక్టర్లతో కలిపి 544 మంది వైద్యులు విధుల్లో ఉంటారు. వీరికి తోడుగా 2,150 మంది పారామెడికల్ సిబ్బంది (నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు) షిఫ్టుల వారీగా 24 గంటల పాటు సేవలు అందించనున్నారు. గోల్డెన్ అవర్లో చికిత్స అందించేలా 35 అంబులెన్సులను సిద్ధం చేశారు. మెరుగైన వైద్యం అవసరమైతే పేషెంట్లను ములుగు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు, వరంగల్ ఎంజీఎంలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఆ రెండు ఆస్పత్రుల్లో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.



