ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, లావుడియ రాజు..
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20వ తేదీన అసెంబ్లీలో ప్రవేశ పెట్టె రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది, మంగళవారం రోజున ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యకు 30% నిధులు కేటాయించాలని ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు మాట్లాడుతూ.. విద్య అనేది సమాజ అభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు మూలస్తంభం అయినప్పటికీ ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని, రాష్ట్రంలో పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని, అనేక విద్యాసంస్థల్లో భవనాలు, తరగతి గదులు, ల్యాబొరేటరీలు, లైబ్రరీలు, హాస్టళ్లు సరిపడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.
ఉపాధ్యాయుల పోస్టులు భారీగా ఖాళీగా ఉండటంతో విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని, ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు 8,500 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, ఇవి వెంటనే విడుదల చేయాలని,వాటిని బడ్జెట్లో చేర్చి తక్షణం బకాయిలు విడుదల చేయాలని, వీటిపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది, పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఈ బకాయిల వల్ల చదువులు కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. ప్రభుత్వం విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా భావించి రాష్ట్ర బడ్జెట్లో కనీసం 30 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలి అని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.
ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలను బలోపేతం చేయడం ద్వారా అందరికీ నాణ్యమైన, సమానమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరింది. విద్యార్థుల ప్రాథమిక అవసరాలైన వసతి, భోజనం, విద్యాసౌకర్యాలను ప్రభుత్వం బాధ్యతగా కల్పించాల్సి ఉండగా, వాటిని ఖరీదుగా మార్చడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది. గత బడ్జెట్లో విద్యకు కేవలం 7 .56 శాతం నిధులు మాత్రమే కేటాయించడం వల్ల యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది కొరత, హాస్టల్ సమస్యలు పెరిగిపోయాయని ఎస్ఎఫ్ఐ తెలిపింది, ఈ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం విద్యార్థులపై అదనపు భారం మోపడం సరైనది కాదని ఎస్ఎఫ్ఐ భావిస్తోంది, రాబోయే బడ్జెట్లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సంఘటితం చేసి ఉద్యమాలు చేపడతామని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ హెచ్చరించారు.



