Friday, June 6, 2025
E-PAPER
HomeNewsఒక్కొక్కరికి 30 తులాల బంగారం

ఒక్కొక్కరికి 30 తులాల బంగారం

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు సజావుగా ముగిశాయి. మే 31, హైదారాబాద్‌లోని హైటెక్స్ వేదికగా నిర్వహించిన ఫైనల్ పోటీల్లో.. థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ విజయం సాధించింది. మిస్ వరల్డ్‌ 2025 కిరీటం దక్కించుకుంది. మిస్ ఇథియోపియా రన్నరప్‌గా నిలిచింది.ఈ పోటీల‌పై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి.
దీనిలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ మిస్ వరల్డ్ పోటీలకు భారీగా ఖర్చు చేసిందని.. పైగా కంటెస్టెంట్లకు ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఇచ్చిందని ఆరోపించారు. దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఆరోపణలపై స్పందించారు. మంత్రి మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించడం వల్ల.. తెలంగాణ గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను నిర్వహించిందని తెలిపారు. కొంద‌రు మిస్ వరల్డ్ పోటీలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్ రావు చేసే ఆరోపణలకు సాక్ష్యాలు ఉన్నాయా.. ఉంటే నిరూపించండి అని మంత్రి డిమాండ్ చేశారు.

మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు 30 తులాల బంగారం ఇచ్చామంటూ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని..30 తులాలు కాదు కదా కనీసం 3 గ్రాములు కూడా ఇవ్వలేదని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన అతిథులు.. తెలంగాణ సర్కార్ చేసిన ఏర్పాట్లపై ఎంతో ఆనందం వ్యక్తం చేశారని జూపల్లి చెప్పుకొచ్చారు. కానీ కొందరు మాత్రం కంటెస్టెంట్ల కాళ్లు కడిగించారని.. సొంత పత్రికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులతో కాళ్లు మొక్కించుకున్న ఘనత కేసీఆర్‌దేనంటూ జూపల్లి ఎద్దేశా చేశారు.మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేందుకు ఎన్నో దేశాలు,రాష్ట్రాలు పోటీపడ్డాయని మంత్రి జూపల్లి చెప్పుకొచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఆ అవకాశాన్ని దక్కించుకుందని తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలనిర్వహణ ద్వారా చేనేత కళాకారుల ఉత్పత్తులకు మంచి ప్రచారంలభించిందని మంత్రి జూపల్లి చెప్పుకొచ్చారు. అంతేకాక మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం తమ ప్రభుత్వం కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని.. అయితే స్పాన్సర్ల ద్వారానే దీనిలో 21 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -