Thursday, December 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమూడో విడతలో 394మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

మూడో విడతలో 394మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

- Advertisement -

అత్యధికంగా నల్లగొండలో 42
అత్యల్పంగా ములుగు, హన్మకొండలో ఒక్కోస్థానం
7,916 వార్డు స్థానాలు ఏకగ్రీవం
అత్యధికంగా ఆదిలాబాద్‌లో 736, అత్యల్పంగా హన్మకొండలో 71
3,752 పంచాయతీలు, 28,406వార్డులకు ఎన్నికలు
సర్పంచ్‌ బరిలో 12,246 మంది అభ్యర్థులు
డిసెంబర్‌ 17న పోలింగ్‌, అదే రోజు ఫలితాలు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 394 సర్పంచ్‌, 7,916 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 3,752 పంచాయతీలు, 28,406 వార్డులకు చివరి దశలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల తుది వివరాలను బుధవారం ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. సర్పంచ్‌ స్థానాలకు అత్యధికంగా నల్లగొండలో 42, ఆ తర్వాత సంగారెడ్డిలో 27, కామారెడ్డిలో 26 ఏకగ్రీవమయ్యాయి. అత్యల్పంగా కొమురంభీం ఆసీఫాబాద్‌, హన్మకొండ, ములుగు జిల్లాల్లో ఒక్కో స్థానం చొప్పున గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. వార్డుల వారీగా మూడో దశలో మొత్తం 36,434 వార్డుల్లో 7,916 ఏకగ్రీవమయ్యాయి.

అత్యధికంగా ఆదిలాబాద్‌లో 736, ఆ తర్వాత నల్లగొండలో 596, నిజామాబాద్‌లో 490, అత్యల్పంగా హన్మకొండలో 71, ఆ తర్వాత ములుగులో 78, యాదాద్రి భువనగిరిలో 93 వార్డులు ఏకగ్రీవమైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. 112 వార్డు స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మొత్తం 4,157 పంచాయతీల్లో 394 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా, 11 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 3,752 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌ పదవి కోసం ఒక్కో స్థానానికి 3.2 చొప్పున, వార్డులకు ఒక్కో స్థానానికి 2.3 చొప్పున సగటున అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ లెక్కన సర్పంచ్‌ బరిలో 12,246 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తుది జాబితాను ప్రకటించి ఆల్ఫాబేటికల్‌ వారీగా ఎన్నికల గుర్తులను కేటాయించారు. డిసెంబర్‌ 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు పోలింగ్‌, అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు.

11 గ్రామాలు ఎన్నికలకు దూరం
రాష్ట్రంలో మూడోదశలో ఎన్నికలు జరుగుతున్న 3,752 పంచాయతీల్లో 11 గ్రామాలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 6, కొమురం భీం ఆసీఫాబాద్‌ జిల్లాలో 2, ఆదిలాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో ఒక్కొ గ్రామంలో పోటీకి అభ్యర్థులెవరూ ముందుకు రాలేదు. అలాగే 36,640 వార్డులకు గాను 112 వార్డుల్లో కూడా ఎవరూ పోటీకి ఆసక్తి చూపక పోవడంతో ఒక్క నామినేషన్‌ దాఖలు కాలేదని ఈసీ తెలిపింది. అత్యధికంగా నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 44, ఆ తర్వాత కామారెడ్డి జిల్లాలో 13, ఖమ్మం 9, ఆసీఫాబాద్‌ 8, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో 7 చొప్పున, నామినేషన్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆదిలాబాద్‌లో 5, మంచిర్యాలలో 4, కొత్తగూడెం, గద్వాలలో 3 చొప్పున, మహబూబాబాద్‌, నిర్మల్‌లో 2 చొప్పున, మెదక్‌, ములుగు, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 1 చొప్పున వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -