– అన్ని రంగాల్లోనూ ప్రతికూలత
– మరింత కాలం అమ్మకాల ఒత్తిడి..
ముంబయి : పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం ముదురుతుండటంతో దలాల్ స్ట్రీట్లో అమ్మకాల సునామీతో ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారత ఈక్విటీ మార్కెట్లలో అత్యంత వేగవంతమైన పతనం కనిపిస్తోంది. యుద్ధ భయాలతో మదుపర్లు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడటంతో కేవలం కొద్ది రోజుల్లోనే 400కు పైగా స్టాక్స్ రెండంకెల స్థాయిలో పతనాన్ని మూటగట్టుకున్నాయి.
ఈ అమ్మకాల ఒత్తిడి నుంచి లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ అనే తేడా లేకుండా అన్ని రకాల షేర్లు కుప్పకూలుతున్నాయి. ఏస్ ఈక్విటీ గణాంకాల ప్రకారం.. కొన్ని కంపెనీలు ఏకంగా 40 శాతం వరకు నష్టపోయాయి. ప్రధానంగా ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ 40 శాతం పైగా కోల్పోగా.. అక్విలాన్ నెక్సస్ 30 శాతానికి పైగా పతనమయ్యింది. రైన్ ఇండిస్టీస్, రాజేష్ ఎక్స్పోర్ట్స్, డెక్కన్ గోల్డ్ మైన్స్, కెఎస్ స్మార్ట్ టెక్నాలజీస్ వంటి సంస్థలు కూడా 20 శాతం నుంచి 30 శాతం మేర నష్టపోయాయి. అంత ర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల మరియు సరఫరా గొలుసులో అంతరాయాలు కలగవచ్చనే ఆందోళనతో ఇన్వెస్టర్లు భారీగా షేర్లను వదిలించు కుంటున్నారు. ముఖ్యంగా ఎగుమతులపై ఆధారపడిన ఐటి, తయారీ రంగ షేర్లు యుద్ధ ప్రభావంతో కుదేలవుతున్నాయి. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే అనిశ్చితి ఉన్నంత వరకు భారత స్టాక్ మార్కెట్లలో ఈ ఒడుదొడుకులు కొనసాగే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తోన్నారు.
అనూహ్య లాభాలు..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం అనూహ్యంగా కోలుకుని భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆఖరి గంటలో బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసిజి రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో కనిష్ఠాల నుంచి ఏకంగా 1550 పాయింట్లు పైకెగసి చివరికి 938.93 పాయింట్ల లాభంతో 75,503 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 257.70 పాయింట్లు పుంజుకుని 23,408.80 వద్ద నమోదయ్యింది.
కుప్పకూలిన 400 షేర్లు..
- Advertisement -
- Advertisement -



