– లేనిపక్షంలో స్థానిక ఎన్నికల్లో వందలాది నామినేషన్లు వేయిస్తాం :
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే గ్రామ గ్రామాన వందలాది నామినేషన్లు వేయిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ప్రతీ వార్డులో, పంచాయతీలో వందలాది నామినేషన్లు దాఖలు చేయిస్తామని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఢిల్లీకి వెళ్లడంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్క సారి కూడా బీసీ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించకపోవడం దారుణమని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లే ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డికి గిన్నీస్ రికార్డు నమోదు ఖాయమని ఎద్దేవా చేశారు. బీసీ బిల్లు కోసం తెలంగాణ వికసిత్ యాత్ర పేరిట బీజేపీ యాత్ర చేస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీసీ బిల్లుకు మద్దతివ్వకుండా ఎన్ని యాత్రలు చేసినా బీజేపీని ప్రజలు నమ్మరని తెలిపారు. బీసీ బిల్లు కోసం జులై 17న పెద్ద ఎత్తున రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ కవిత… జులై 16, 17, 18 తేదీల్లో ప్రయాణాలు పెట్టుకున్నవాళ్లు వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము పిలుపునిచ్చిన రైల్ రోకో కార్యక్రమానికి ఆయా కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్ధతు వస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సంఘాలు కూడా తెలంగాణ జాగృతి ఉద్యమానికి మద్దతిస్తున్నాయని వివరించారు.
గోదావరి జలాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. వృథా అవుతున్న గోదావరి నీటిని పొలాలకు మళ్లించుకోవాలన్నది కేసీఆర్ ఆలోచించి తుపాకులగూడెం వద్ద నుంచి గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని వాదించారని అన్నారు. దీని వల్ల తెలంగాణలోని సగం జిల్లాలకు గోదావరి నీరు పుష్కలంగా లభించే అవకాశం ఉంటుందని వివరించారు. పోలవరం నుంచి లింకేజీ ప్రతిపాదనను గతంలోనే జగన్ తెస్తే కేసీఆర్ వ్యతిరేకించారని గుర్తుచేశారు.
తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకం కాదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని కవిత ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు రాశారని ఎండగట్టారు. ఏపీ జలదోపిడీని నివారించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పేపర్ టైగర్గా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టులో భాగంగా 150 టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి వద్ద భారీ రిజర్వాయర్ నిర్మించి నల్లమల అడవిని ముంచేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు. దీనిపై తెలంగాణ జాగృతి తరఫున న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. ”ముఖ్యమంత్రి బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టకుండా అడ్డుకోండి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సీఎం డిమాండ్ చేయాలి” అని వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ కగార్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఈ మారణకాండను ప్రభుత్వాలు ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలన్నారు. ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి మరణించడం పట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES