శాంతి బోర్డు హామీ ఇచ్చిందన్న ట్రంప్
వాషింగ్టన్ : గాజాలో మానవతావాద, పునర్నిర్మాణ యత్నాల కోసం ఐదు బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సాయం అందించేందుకు ‘శాంతి బోర్డు’లోని సభ్యదేశాలు హామీ ఇచ్చాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. బోర్డు సభ్యులు తొలిసారిగా వాషింగ్టన్లో గురువారం సమావేశమవుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఆ సమావేశంలో సాయంపై ప్రకటన ఉంటుందని ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. గాజాలో భద్రత, శాంతి కోసం ఏర్పాటు చేసే అంతర్జాతీయ స్థిరీకరణ దళం, స్థానిక పోలీసింగ్ వ్యవస్థ కోసం వేలాది మంది సిబ్బందిని పంపేందుకు కూడా బోర్డులోని సభ్య దేశాలు అంగీకరించాయని ఆయన తెలియజేశారు. బోర్డు సామర్ధ్యం అపరిమితమైనదని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఈ నెల 19వ తేదీ నేను మరోసారి బోర్డు సభ్యులను కలుస్తాను. ఆ సమావేశంలోనే ఆర్థిక సాయంపై ప్రకటన వెలువడుతుంది’ అని ట్రంప్ చెప్పారు.
ప్రభుత్వ అధినేతలు సహా 20 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని తెలిపారు. వాషింగ్టన్లోని డోనాల్డ్ జే.ట్రంప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్లో సమావేశం జరుగుతుందని అన్నారు. అమెకా విదేశాంగ శాఖ ఇటీవలే యూఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్కు అధ్యక్షుడి పేరును చేర్చింది. కాగా శాంతి బోర్డులో 24 మందికి పైగా వ్యవస్థాపక సభ్యులు ఉండగా వారిలో ఎంతమంది సమావేశానికి హాజరవుతారో తెలియడం లేదు. గత వారం శ్వేతసౌధంలో ట్రంప్ను కలిసిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఈ భేటీకి రాకపోవచ్చునని తెలుస్తోంది. మధ్యప్రాచ్య దేశాలతో పాటు టర్కీ, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, ఇజ్రాయిల్, ఇండోనేషియాలు ఈ బోర్డులో సభ్యులుగా ఉన్నాయి. అయితే అనేక పశ్చిమ దేశాలు దీనికి దూరంగా ఉండడం గమనార్హం. శాంతి బోర్డు స్వభావం, ఉద్దేశంపై యూరప్కు చెందిన పలువురు దౌత్యవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఐరాస వ్యవస్థకు సమాంతరం అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.



