ప్రభుత్వ నిర్బంధాన్ని లెక్క చేయని కార్మికులు
సమ్మెకు ప్రజానీకం సంపూర్ణ మద్దతు
పనామా : పనామాలో తమ హక్కుల కోసం కార్మికులు సమ్మెబాట పట్టారు. సమ్మె శనివారం నాటికి 50వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం అపరేషన్ ఒమేగా పేరుతో అణచివేతకు దిగినా కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యవసాయ కార్మికులు, వైద్యులు, ఆదివాసీ ప్రజలు సమ్మెకు మద్దతుగా పాల్గొంటున్నారు. ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరుపుతుండటంతోపాటు నిర్బంధాన్ని కొనసాగిస్తోంది.
సమ్మె ఎందుకు?
పనామా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ సంస్కరణలను కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీటివల్ల రిటైర్డ్ బెనిఫిట్స్ నష్టపోతామని, ప్రైవేటీకరణ వల్ల భద్రత లేకుండా పోతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాతో భద్రతా ఒప్పందంలో భాగంగా నాలుగు సైనిక స్థావరాలకు అనుమతించే ప్రతిపాదనను కార్మికులతోపాటు సామాన్య ప్రజలూ వ్వతిరేకిస్తున్నారు. అమెరికా పనామా కాలువపై కన్నేసిందని, స్వాధీనానికి ప్రయత్నిస్తుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అరటి తోటల కార్మికుల డిమాండ్స్లో కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించింది. తొలగించిన కార్మికులను తిరిగి తీసుకుంటామని, సబ్సిడీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ సందర్బంగా అరటి కార్మికుల యూనియన్ నాయకుడు ఫ్రాన్సిస్కో స్మిత్ మాట్లాడుతూ మిగతా డిమాండ్లను సాధించుకునేందుకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
ప్రభుత్వ నిర్బంధం
ముళినో ప్రభుత్వం ఒక వైపు చర్చలు జరుపుతూ మరోవైపు కార్మికులపై నిర్బంధాన్ని కొనసాగిస్తోంది. నిరసనలను అణచివేసేందుకు 1300 మంది భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. బొకాస్ డెల్ టోరోలో నిరసన తెలుపుతున్న కార్మికులను 50 మందిని అరెస్ట్ చేసి, 14 మందిని జైలుకు పంపింది. కార్మిక నాయకుడు ఫ్రాన్సిస్కో స్మిత్ని జూన్ 14న పనామాలో అరెస్ట్ చేసింది. విద్యార్థి నాయకుడు ఎడ్వర్డో గార్సియాను ఈ నెల 18న అరెస్ట్ చేసి, యూనివర్శిటీ నుంచి ఐదేళ్లపాటు బహిష్కరించింది. ముళినో ప్రభుత్వం ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా, సంస్కరణలను రద్దు చేసేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఉపాధ్యాయ సంఘం నాయకుడు ఫెర్నాండో ఆబ్రెగో స్పష్టం చేశారు.
పనామాలో కార్మికుల 50 రోజుల జాతీయ సమ్మె
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES