Friday, June 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు50 నిమిషాలు..18 ప్రశ్నలు

50 నిమిషాలు..18 ప్రశ్నలు

- Advertisement -

నీటి నిల్వ ఇంజినీర్లకే తెలుసు
బ్యారేజీల నిర్మాణం సాంకేతిక అంశం
హెల్త్‌ బాలే..వన్‌ టూ వన్‌ ఐతే ఓకే..
కాళేశ్వరం న్యాయ కమిషన్‌ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌
ఇన్‌ కెమెరాలో విచారణ
భారీ బందోస్తు ఏర్పాటు

ఎట్టకేలకు టామ్‌ అండ్‌ జెర్రీ ఆట ముగింపునకు వచ్చింది. మాజీ సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన్ని కమిషన్‌ ముందుకు తెచ్చేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ తీవ్ర ప్రయత్నమే చేసింది. అంతకుముందు విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు అంగీకరించని కేసీఆర్‌ తాజాగా కాళేశ్వరం విచారణకు వెళ్లొచ్చారు. వెళ్ళకుంటే…నిజంగానే తామేదో తప్పుచేసినట్టు రేవంత్‌ సర్కార్‌ బలంగా ప్రచారం చేస్తుందనే రాజకీయ కారణం కూడా దీనివెనుక ఉన్నట్టు తెలుస్తుంది. రెండ్రోజుల క్రితం మాజీ మంత్రి టీ హరీశ్‌రావు కాళేశ్వరం న్యాయ కమిషన్‌ ఎదుట హాజరై ఏ విషయాలైతే ప్రస్తావించి, వివరణ ఇచ్చారో, వాటినే కేసీఆర్‌ కూడా మరోసారి ధృవీకరించారు. ఈ అంశంపై న్యాయ కమిషన్‌ ఇప్పటి వరకు 114 మందిని విచారించింది. 115వ సాక్షిగా కేసీఆర్‌ను విచారించింది. రెండ్రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి కూడా న్యాయ కమిషన్‌ ఎదుట హాజరై, తన వాదన వినిపిస్తానని ఢిల్లీలో చెప్పారు. ఆదివారం హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆత్మకథ ఆవిష్కరణ సభలో కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని చాలా గొప్పగా గుర్తుచేసుకున్న సీఎం, ఢిల్లీ వెళ్లి ఆయనే రాష్ట్ర ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని ఆరోపించడం రాజకీయ విశేషం!!
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు బ్యారేజీల వైఫల్యంపై మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావును న్యాయవిచారణ కమిషన్‌ విచారించింది. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:50 నిమిషా ల వరకు ప్రశ్నలను సంధించింది. విచారణ కమిషన్‌ చైర్మెన్‌ పీసీ ఘోష్‌తోపాటు కార్యదర్శి మురళీధర్‌, కేసీఆర్‌ ముగ్గురే ఉన్నారు. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ఎవరికీ అనుమతించలేదు. తొలుత ఓపెన్‌ హాల్‌లో విచారణ చేయాలని కమిషన్‌ చైర్మెన్‌ భావించినా ‘తన ఆరోగ్యం బాగాలేదనీ, జలుబుతో స్వల్ప అనారోగ్యానికి గురయ్యానని, వన్‌ టూ వన్‌ అయితే తాను స్పష్టంగా సమాధానాలు చెప్పగలనని’ కేసీఆర్‌ చేసిన విజ్ఞప్తికి కమిషన్‌ చైర్మెన్‌ పీసీ ఘోష్‌ అనుమతించారు. దీంతో ముగ్గురు మాత్రమే ఓపెన్‌ హాల్‌లో ఉన్నారు. మీడియాతో పాటు ఇతరులను ఓపెన్‌ హాల్‌ నుంచి బయటకు పంపారు. సుమారు 50 నిమిషాల పాటు సాగిన విచారణలో కేసీఆర్‌ను పదుల సంఖ్యలో కమిషన్‌ ప్రశ్నలు వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి నుంచి చివరి దాకా జరిగిన ప్రక్రియపై సమాచారం రాబట్టినట్టు తెలిసింది. 115వ సాక్షిగా హాజరైన కేసీఆర్‌ నుంచి అఫిడవిట్‌ సైతం తీసుకున్నారు.
క్యాబినెట్‌ అనుమతి ఉందా ? కేసీఆర్‌కు కమిషన్‌ సూటి ప్రశ్నలు
విచారణ సందర్భంగా కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్‌ 18 ప్రశ్నలు అడిగింది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. ఈ క్రమంలో కాళేశ్వరం రీ ఇంజినీరింగ్‌ గురించి కేసీఆర్‌ కమిషన్‌కు వివరించారు. క్యాబినెట్‌, ప్రభుత్వ ఆమోదంతోనే బ్యారేజీల నిర్మాణం జరిగిందని సమాధానమిచ్చారు. వ్యాప్కోస్‌ సిఫారసుల ప్రకారం నిర్మాణం జరిగిందనీ, అన్నీ అనుమతులు తీసుకున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్నీ అంశాలతో కూడిన ముద్రించిన పుస్తకాన్ని కమిషన్‌కు అందజేశారు. కాళేశ్వరం కార్పొరేషన్‌ గురించి కూడా కమిషన్‌ ఆరా తీసింది. నూతన రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్టు కేసీఆర్‌ కమిషన్‌కు తెలియజేశారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి కేసీఆర్‌ను కమిషన్‌ ఆరా తీయగా, ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజినీర్లకు సంబంధించిన అంశమనీ కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. బ్యారేజీల నిర్మాణం స్థలం ఎంపిక, మార్పు సాంకేతిక పరమైన విషయమని వివరించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కమిషన్‌ చైర్మెన్‌కు జీవో నెంబరు 45, ఆపరేషన్‌, నిర్వహణ పుస్తకాన్ని అందజేశారు.
ఇప్పటికే 114 మందిని విచారణ
కాళేశ్వరం కమిషన్‌ ఎదుట విచారణకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రావడం సంచనలమే అయింది. బీఆర్‌కే భవన్‌లో ఆయన్ను జస్టిస్‌ బీసీ ఘోష్‌ ప్రశ్నించారు. రీ ఇంజినీరింగ్‌, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్‌ ఏర్పాటు, నీటి నిల్వలపై ఆయన్ను ఆరా తీశారు. ఇప్పటివరకు 114 మందిని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారించింది. ఇప్పటివరకు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన ఘోష్‌ కమిషన్‌ ఇటీవలే మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌, మరో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును సైతం విచారించిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు రావడం తదితర కారణాల నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్‌, ఆపరేషన్‌, నిర్వహణ, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో), నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను సైతం పూర్తిచేసింది. తాజాగా కేసీఆర్‌ను పిలిచింది. బుధవారం ఎర్రవల్లి ఫామ్‌నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కేసీఆర్‌, హైదరాబాద్‌లో బీఆర్‌కే భవన్‌ వరకు భారీ కాన్వారుతో వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు తనిఖీలు సైతం నిర్వహించారు. బీఆర్‌కే భవన్‌లో పనిచేసే ఆయా ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, సిబ్బందిని ఐడీ కార్డులు చూసి సంబంధిత శాఖలు ఉన్న ప్రాంతాలకు పంపించారు. మిగతావారిని ఎవరినీ భవన్‌లోకి అనుమతించలేదు. కేసీఆర్‌ రాక నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు హడావిడి చేశాయి. కేసీఆర్‌ జిందాబాద్‌ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఒకానొక సందర్భంలో పోలీసులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోని ఆయా పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -