మహేశ్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్తో బీసీ జేఏసీ నేతల భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 56 శాతం టికెట్లు కేటాయించాలని బీసీ జేఏసీ నేతలు కోరారు. ఈ మేరకు గురవారం వారు ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ తో బీసీ జేఏసీ చైర్మెన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు వినతిపత్రం సమర్పించారు. అనంతరం బీసీ జేఏసీ చైర్మెన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. చట్టబద్ధంగా సాధ్యం కాకపోతే పార్టీపరంగా ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయ అవకాశాలు పెంచేందుకు పార్టీపరంగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు, పార్టీలో అందరితో చర్చించి బీసీలకు రాజకీయంగా న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చినట్టు తెలిపారు.



