ఆహార కేంద్రాలపై అమానుష దాడుల్లో 118కి పెరిగిన మృతుల సంఖ్య
గాజా : ఇజ్రాయిల్ దురాగతాలకు అంతం లేకుండా పోతోంది. గాజాలో కొనసాగిస్తున్న దాడుల్లో శనివారం తెల్లవారు జాము నుంచి సాయంత్రానికి 66మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ గాజాలోని రఫాకు సమీపంలో అల్ అఖావాలో ఆహార పంపిణీ కేంద్రం వద్ద తమ వంతు ఆహారం కోసం వేచి ఉన్న వారిపై జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతిచెందారు. దీంతో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్ఎఫ్) తన కార్యకలాపాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఆహారం కోసం వచ్చి మరణించిన వారి సంఖ్య 118కి పెరిగింది. గాజా నగరంలోని సాబ్రా ప్రాంతంలో ఇజ్రాయిల్ జరిపిన దాడిలో 15మంది మరణించగా, మరో 50మంది గాయపడ్డారని గాజా పౌరరక్షణ దళాలు తెలిపాయి. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ ఊచకోతకు మృతి చెందిన వారి సంఖ్య 54,772కు చేరుకుంది. గాయపడిన వారి సంఖ్య 1,25,834కి చేరుకుందని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వీరు కాకుండా వేలాదిమంది ఇంకా శిధిలాల కింద చిక్కుకుపోయి లెక్కలకు అందకుండా ఉన్నారని పేర్కొంది. హమాస్ చెరలో ఉన్న థాయి జాతీయుడు నతాపాంగ్ పింటా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటించింది. ఇజ్రాయిల్ ఆర్మీ ముట్టడి చేసిన ప్రాంతంలో ప్రస్తుతం ఇజ్రాయిల్ బందీ మతన్ జంగాకర్ ఉన్నాడని హమాస్ ప్రతినిధి అబూ ఒబెదా హెచ్చరించారు. శుక్రవారం నాటి దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 40మందికి పైగా మరణించారని హమాస్ తెలిపింది. ఈ దారుణమైన కిరాతకాలను తక్షణమే నిలిపేలా అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరింది.
దొరికితే పిల్లలకు కాస్తంత ఆహారం.. లేకుంటే మరణమో, గాయాలో…
గాజాలోని ఆహార పంపిణీ కేంద్రాలు ”ఉచ్చులుగా” మారుతున్నాయని పాలస్తీనా ఎన్జిఓ నెట్వర్క్ డైరెక్టర్ అంజాద్ షవా ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్ఎఫ్) ఆహార పంపిణీ కేంద్రాలన్నీ ట్రాప్లుగా మారాయని ఆయన విమర్శించారు. గాజా ఉత్తర ప్రాంతంలో ఎక్కడా ఆహార పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో అక్కడి ప్రజలు ఆహారం కోసం సుదూర ప్రాంతాల నుండి నడిచి రావాల్సి వస్తోంది. లేదా దక్షిణ ప్రాంతంలో స్థిరపడాలని చూస్తున్నారు. ఉత్తర ప్రాంతం నుంచి ప్రజలను బలవంతంగా ఇక్కడకు రప్పించాలన్నది ఇజ్రాయిల్ ఎజెండాగా ఉందని ఆయన విమర్శించారు. పాలస్తీనియన్ల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ మానవతా ప్రమా ణాలకు హామీ కల్పిస్తూ ఏర్పడిన యుఎన్ఆర్డబ్ల్యుఎ, ఇతర మానవతా సంస్థల పంపిణీ కేంద్రాల స్థానంలో జీహెచ్ఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది వారి లక్ష్యంగా ఉందని షావా విమర్శించారు. ఆహారం కోసం అక్కడకు వెళితే కాల్పుల్లో చనిపోవడమో లేదా గాయపడడమో జరుగుతుందని తెలిసి కూడా ప్రజలు అక్కడికే వెళ్లాల్సి వస్తోందని అన్నారు. తమ పిల్లలకు పెట్టడానికి కాస్తంత ఆహారం దక్కుతుందనే ఆశతో అన్ని కష్టాలను, ఇబ్బందులను దాటుకుని కిలోమీటర్ల మేర నడిచి ఇక్కడకు వస్తున్నారని, తీరా ఇక్కడకు వస్తే దక్కితే ఆహారం లేదా ప్రాణాలు పోవడమనేది సాధారణమై పోయిందని ఆయన విమర్శించారు.
తాజాగా తరలింపు ఆదేశాలు
వాయవ్య గాజాలోని అబ్దుల్ రహమాన్ ప్రాంతం, జాబాలియా శరణార్ధ శిబిరంలోని అల్ నహదా ప్రాంతాల నుంచి ప్రజలందరూ వెంటనే దక్షిణ ప్రాంతానికి వెళ్లిపోవాలని ఇజ్రాయిల్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం గాజాలో ఆహార అభద్రతా స్థాయి తీవ్రంగా వుందని, దాదాపు 70వేల మంది పిల్లలు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆహార కార్యక్రమం పేర్కొంది. దాదాపు మూడున్నర లక్షలమంది పాలస్తీనియన్లు వివిధ రకాల వ్యాధులతో బాధ పడుతున్నారని పాలస్తీనా మెడికల్ రిలీఫ్ సొసైటీ తెలిపింది.
ఇజ్రాయిల్ దారుణాలకుమరో 66మంది పాలస్తీనియన్లు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES