సదరన్ లెబనాన్పై విరుచుకుపడిన ఇజ్రాయిల్ సైన్యం
గాజాలో 33 మంది మృతి..చిన్నారులకూ గాయాలు
కాల్పుల విరమణపై చర్చిస్తున్నాం : నెతన్యాహూ
వాషింగ్టన్ : గాజాలో కాల్పుల విరమణకు సంబంధించిన తాజా ప్రణాళికపై అమెరికా అధ్యక్ష భవనంతో చర్చిస్తున్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో సోమవారం సమావేశం కావడానికి ముందు నెతన్యాహూ ఈ వ్యాఖ్య చేశారు. గాజాలో యుద్ధాన్ని ముగించి, హమాస్ వద్ద బందీలుగా మిగిలి ఉన్న వారిని విడుదల చేయించేందుకు ట్రంప్ ఓ ప్రణాళికను రూపొందించిన విషయం తెలిసిందే. దీనికి అంగీకరించేలా ఆయన నెతన్యాహూపై ఒత్తిడి పెంచుతున్నారు. జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెతన్యాహూ వాషింగ్టన్లో పర్యటించడం ఇది నాలుగోసారి.
గాజాలో యుద్ధానికి స్వస్తి చెప్పాలంటూ నెతన్యాహూపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ప్రధానంగా గాజా నగరంలో ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహోమాన్ని అనేక దేశాలు నిరసిస్తున్నాయి. ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికే 66 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సదరన్ లెబనాన్పై ఇజ్రాయిల్ క్షిపణిదాడులకు దిగింది. సోమవారం తాజాగా గాజాలో జరిపిన బాంబుల దాడిలో 33 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.