సీఎం రేవంత్రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హోర్డింగ్ ఏజెన్సీల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం జీవోనెంబర్ 68ని రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆయన శనివారం లేఖ రాశారు. తెలంగాణ ఔట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ బృందం తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తనను కలిసి వారి సమస్యలు వివరించి వినతిపత్రాన్ని సమర్పించారని తెలిపారు. ఆ సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నామనీ, పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ అంశంపై గత జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ’68 జీవోని రద్దు చేస్తాం. హోర్డింగ్లపై అధికార పార్టీ గుత్తాదిపత్యాన్ని తొలగించి వాటిపై ఆధారపడిన కుటుంబాల వారిని రక్షిస్తాం, వారికి చేయూతనిస్తాం’అని పేర్కొన్నదని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 21 నెలలు దాటినా, ఎలాంటి చర్యల్లేవని తెలిపారు. ఇప్పటికైనా 68 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమల ప్రకటనలపై వచ్చిన పన్నుతో స్థానికంగా రోడ్లు, వీధి దీపాలు, ఇతర అభివృద్ధి పనులు జరిగేవని పేర్కొన్నారు. కానీ 2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 68 జీవోని తెచ్చి హోర్డింగ్ ఏజెన్సీలను రద్దు చేసిందని తెలిపారు.
కేవలం వారికి ఇష్టమైన మూడు పెద్ద ఏజెన్సీలకే లాభం కట్టబెట్టిందని విమర్శించారు. దీంతో చిన్న హోర్డింగ్ ఏజెన్సీలు ఇతర మున్సిపల్ కార్పొరేషన్లల్లో కార్యక్రమాలు కొనసాగిస్తుంటే, వాటిని అడ్డుకుని, హోర్డింగ్లు తొలగించిందని తెలిపారు. చదువుకుని, ఉద్యోగాలు రాక జీవనోపాధి కోసం నిరుద్యోగులు పెట్టుకున్న ఈ 209 ఏజెన్సీల్లో ఉన్న సుమారు 50 వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీలన్నీ తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాయని వివరించారు. పైగా గుత్తాధిపత్యంతో నడిపే రెండు ఏజెన్సీలు అసోసియేషన్ వాళ్లని బెదిరింపులకు గురిచేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ మూడు ఏజెన్సీలు మాత్రమే ఉండడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా పడిపోయిందని పేర్కొన్నారు. ఈ శాఖను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యవేక్షిస్తున్నందున యాడ్ ఏజెన్సీ అసోసియేషన్ వారిని పిలిచి, చర్చించాలని కోరారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హోర్డింగ్ ఏజెన్సీలను పునరుద్ధరించేందుకు జీహెచ్ఎంసీతోపాటు, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకూ కొత్త ప్రకటనల విధానాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్నచిన్న ఏజెన్సీలు కూడా వ్యాపారం చేసుకునేలా టెండర్ల ప్రక్రియ ఉండేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.