నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ తమిళ నటుడు విశాల్ అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన వేదికపైనే స్పృహ తప్పిపడిపోయారు. ఈవెంట్ నిర్వాహకులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సమాచారం ప్రకారం.. తమిళనాడు విల్లుపురంలో ఆదివారం మిస్ కువాగం ట్రాన్స్జెండర్ బ్యూటీ కాంటెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో విశాల్ హాజరయ్యారు. కొద్దిసేపటికే విశాల్ స్పృహ తప్పిపడిపోయారు. దాంతో వెంటనే ఆయన టీమ్, మాజీ మంత్రి కే పొన్ముడి సహా కార్యక్రమం నిర్వాహకులు వెంటనే ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు. ఈ ఘటనలో విశాల్ అభిమానులతో పాటు కార్యక్రమానికి వచ్చిన వారంతా షాక్కు గురయ్యారు.
ఆయన పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఆసుపత్రి నిర్వాహకులు మాత్రం స్పందించలేదు. విశాల్ మేనేజర్ హరి మాట్లాడుతూ ఆయన భోజనం చేయకపోవడం వల్లే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో నటుడు డెంగ్యూ బారినపడి కోలుకున్నారు. ఇటీవల విశాల్ తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు. దాంతో ఆయన ఆరోగ్యంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు రాగా.. వాటన్నింటిని ఆయన టీమ్ ఖండించింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసింది. అయితే, విశాల్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తమ అభిమాన హీరో ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా.. విశాల్ ఇటీవల ‘మద గజ రాజా’ సినిమాలో నటించారు. తుప్పరివాలన్-2 (తెలుగులో డిటెక్టివ్) మూవీలో నటిస్తున్నారు.
హీరో విశాల్కు అస్వస్థత.. వేదికపైనే పడిపోయాడు
- Advertisement -
- Advertisement -