మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, పీఎంహెచ్లలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు టైంస్కేల్ ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మెలో ఉన్న కార్మికుల న్యాయమైన సమ స్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ సంక్షేమ శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్కు ఆయన బుధవారం లేఖ రాశారు. రాష్ట్రం లో గిరిజన సంక్షేమ సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, పీఎంహెచ్లలో పనిచేస్తున్న డైలీవేజ్, కాంటింజెంట్, పార్ట్ టైం తదితర పేర్లతో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులు టైంస్కేల్ ఇవ్వాలనీ, ఇతర న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెల 12 నుంచి సమ్మెలో ఉన్నారని తెలిపారు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకనుగుణంగా కొత్త పోస్టులు మంజూరు చేయకుండా, ఉద్యోగ విరమణ స్థానాల్లో ఏర్పడిన ఖాళీలు భర్తీ చేయకుండా డైలీవేజ్, పార్ట్టైం, కాంటింజెంట్ పేరుతో నియమిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారిని పర్మినెంట్ చేస్తామని జీవోనెంబర్ 16 విడుదల చేసిందని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వును అమలు చేయాలని 2017, ఏప్రిల్ 26న హైకోర్టు తీర్పునిచ్చిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో 2016, ఫిబ్రవరి 26 నాటికి పదేండ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని రెగ్యులరైజ్ చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ మెమో నెంబర్ సి2/1846/2016ను జారీ చేశారని వివరించారు. అయినా అమలు చేయడం లేదని తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం నల్లగొండ జిల్లాలో టైం స్కేలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇతర జిల్లాల్లో అమలు చేయడం లేదని విమర్శించారు. అంతే కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన 64 జీవో ప్రకారం వారిని ఏజెన్సీలకు అప్పగించడం వల్ల వేతనాలు సగానికి పైగా తగ్గించారని తెలిపారు. ఇస్తున్న అరకొర వేతనాలు కూడా క్రమంగా ఇవ్వకుండా నెలల తరబడి పెండిరగ్లో పెట్టి ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమని విమర్శించారు. అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నా పరిష్కారం కాకపోవడంతో గత్యంతరం లేక సమ్మె చేస్తున్నారని వివరించారు. మంత్రి జోక్యం చేసుకుని సమ్మెలో ఉన్న ఔట్సోర్సింగ్ కార్మికులకు టైంస్కేల్ ఇప్పించాలనీ, వారిని చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.