అఖిలపక్షంతో ఢిల్లీలో పోరాడాలి
42 శాతం బీసీ రిజర్వేషన్లకు సీపీఐ(ఎం) పూర్తి మద్దతు : రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు
నవతెలంగాణ-ఇల్లందు
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరి స్తున్న వైఖరి సరైనదే అయినప్పటికీ, 42 శాతం బీసీ రిజర్వేషన్ను అడ్డుకుంటున్న బీజేపీపై పోరాటం చేయడానికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను అఖిలపక్షంగా తీసుకు వెళ్లి ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు స్పష్టం చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ(ఎం) బలపరుస్తుందన్నారు. ఈ నిర్ణయం అమలు కాకుండా అడ్డుపడుతున్న బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో బీసీ కులాలు చాలా వెనకబడి ఉన్నాయని, ఎంబీసీలు ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా వెనుకబడి ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.
కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఎంబీసీలలోని కొన్ని కులాలను సామాజిక గ్రామ బహిష్కరణకు గురి చేస్తున్నారన్న విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసి 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం చాలా సమంజసమైందని, దీన్ని పార్టీ స్వాగతిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి తగిన పద్ధతిలో కాంగ్రెస్ స్పందించడం లేదని విమర్శించారు. గవర్నర్ ఆమోదం కోసం చేయాల్సిన రాజకీయ పోరాటాన్ని ఒంటరిగా చేయడం సరైనది కాదన్నారు. చలో రాజ్ భవన్ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకత్వాన్ని అరెస్ట్ చేయడాన్ని పోతినేని తీవ్రంగా ఖండించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం సీపీఐ(ఎం), సీపీఐ కలిసి వచ్చే కొన్ని మాస్లైన్ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే.రమేష్, జిల్లా నాయకులు ఎస్ఏ.నభీ, ఆలేటి కిరణ్ పాల్గొన్నారు