నవతెలంగాణ – జన్నారం: మద్యానికి బానిసై మద్యం మత్తులో తండ్రిని కొడుకు హత్య చేసిన విషాద ఘటన జన్నారం మండలంలో చోటుచేసుకుంది. లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి జన్నారం ఎస్సై అనూష తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని సేవాదాస్ నగర్ కు చెందిన జాదవ్ శంకర్ నాయక్ (55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుమారుడు జాదవ్ నూర్ సింగ్(30) మద్యానికి బానిసై రోజు తాగి కుటుంబ సభ్యులతో గొడవపడమే కాకుండా తండ్రితో కూడా గొడవపడేవాడు. నూర్ సింగ్ మద్యానికి బానిసై తరుచు గొడవ పడడంతో ఆయన భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. తరచూ తాగి వచ్చి తండ్రి శంకర్ నాయక్ ను డబ్బులు ఇవ్వమని వేధించేవాడు.
శనివారం ఉదయం నూర్ సింగ్ మద్యం మత్తులో తన ఇంట్లో ఉన్న రోకలి దుడ్డుతో శంకర్ నాయక్ తల వెనుక భాగంపై కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టామని నిందితుడు నూర్ సింగ్ పరారీలో ఉన్నాడని కుమార్తె భూక్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. శంకర్ నాయక్ భార్య గత మూడు సంవత్సరాల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. శంకర్ నాయక్ ప్రస్తుతం తన కొడుకు నూరుసింగ్ వద్దే ఉంటున్నాడు..