Monday, October 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేసు ఎందుకు నమోదు చేయలేదు

కేసు ఎందుకు నమోదు చేయలేదు

- Advertisement -

– ‘గవాయ్‌’పై దాడి ఘటనను నిరసిస్తూ ఆత్మగౌరవ ర్యాలీ
– నవంబర్‌1న హైదరాబాద్‌లో లక్షలాది మంది దళితులతో కార్యక్రమం : పద్మశ్రీ మందకష్ణ మాదిగ
నవతెలంగాణ-హసన్‌పర్తి

దేశ రాజధానిలో, అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై దాడి జరిగితే నేటికీ కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టులోని కేఎల్‌ఎన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఎమ్మార్పీఎస్‌, అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్‌ మాదిగ అధ్యక్షతన జరిగింది. మందకృష్ణ మాదిగ హాజరై మాట్లాడుతూ… ఎన్నో కేసులను సుమోటోగా స్వీకరిస్తున్న పోలీసు వ్యవస్థకు , న్యాయవ్యవస్థకు చీఫ్‌ జస్టిస్‌ మీద జరిగిన దాడి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే దేశంలో సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుందని అన్నారు. గవాయ్‌ మీద జరిగిన దాడి దళితులపైన జరిగిన దాడిగా చూస్తున్నామని అన్నారు. తక్షణమే దాడి ఘటన మీద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేయాలని కోరారు. సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి, ఘటన వెనుక ఉన్న శక్తులను గుర్తించాలని, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దాడి విషయంలో న్యాయం కోసం నవంబర్‌ 1న లక్షలాది మందితో ఛలో హైదరాబాద్‌ పేరుతో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తామని, దళిత ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ వెంకటస్వామిమాదిగ, ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్‌మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్‌మాదిగ, ఎంఎస్పి జాతీయ నేత మందకుమార్‌మాదిగ, ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు రాజారపు భిక్షపతి మాదిగ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -